నల్లగొండ ప్రతినిధి, జూలై 22 (నమస్తే తెలంగాణ): జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రంగప్రవేశాన్ని నీటుగా, దీటుగా ఎదుర్కోలేని బీజేపీ ముఖ్యనేతలు..ఆయనను తెలంగాణలోనే ఎంగేజ్ చేసేందుకు ఉప ఎన్నికను సృష్టించే చిల్లరప్రయత్నం చేస్తున్నారని రుజువవుతున్నది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిని చేర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో ఉప ఎన్నిక తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదంటూ ‘కోమటిరెడ్డికి బీజేపీ తీర్థం’ శీర్షికన నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనం నిజమేననితెలిసింది. బీజేపీలో తన చేరిక ఖాయమేనని అనుచరులకు రాజగోపాల్రెడ్డి సంకేతాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
బీజేపీ కీలక నేత అమిత్షాతో పార్లమెంట్ సెంట్రల్హాల్లో భేటీని కూడా ఒప్పుకొన్నారని తెలిసింది. ఉన్నట్టుండి బీజేపీలోకి వెళ్లడమంటే.. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఏలా స్పందిస్తారో అనే సంశయాన్ని అనుచరులు వ్యక్తం చేయగా, ‘అమిత్ షా పిలిచారు. మనతో వచ్చేవాళ్లే వస్తారు’ అని రాజగోపాల్రెడ్డి అన్నట్టు సమాచారం. ఉప ఎన్నికకు సైతం సిద్ధమవ్వాలని, ఓడితే.. ఓడుతామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ప్రస్తుతం నియోజవర్గంలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమేనని, కాంగ్రెస్ నుంచి వచ్చేవాళ్లు వస్తారని అన్నట్టు సమాచారం. ‘మూడేండ్లుగా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఏమీ చేయలేకపోయాం.. ఏడాదిన్నరలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చేసేదేమీ ఉండదు కదా’ అని అనుచరులతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది.