కొల్లాపూర్ : రాష్ట్ర జీవిత బీమా సంస్థలో చేసిన మూడు పాలసీలు మెచ్యూరిటీ కావడంతో డబ్బుల విడుదలకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఎంఈవో, ఉపాధ్యాయుడు పట్టుబడిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది.
మహబూబ్నగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ వివరాలను వెల్లడించారు. కొల్లాపూర్లో రిటైర్డ్ సబ్ పోస్ట్మాస్టర్ పుట్టపాగ సిద్ధన్న, ఉమాదేవి దంపతులు నివసిస్తున్నారు. ఉమాదేవి పట్టణంలోని బీసీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నది. ఆమె రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా సంస్థలో మూడు పాలసీలు చేసింది. పాలసీల మెచ్యూరిటీ గడువు ఈ ఏడాది ఆగస్టు 1న ముగిసింది. వీటికి సంబంధించిన జిరాక్స్లను కొల్లాపూర్లోని వరిదేల యూపీఎస్లో డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్న ఎమ్మార్సీ చంద్రశేఖర్కు అందజేశారు. అతడి నుంచి ఎంఈవో చంద్రశేఖర్రెడ్డికి అందజేయాలి. వీటి కోసం రెండు, మూడ్రోజుల్లో కలవాలని ఉమాదేవికి ఎమ్మార్సీ సూచించారు.
దీంతో ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన ఉమాదేవి భర్త సిద్ధన్న ఎమ్మార్సీని కలవగా.. లెటర్ టైప్ చేసి పాలసీ జిరాక్స్ ప్రతులను ఎంఈవో చంద్రశేఖర్రెడ్డితో సంతకం చేయించాక అందిస్తే మహబూబ్నగర్కు పంపిస్తానని చంద్రశేఖర్ సూచించాడు. తీరా ఎంఈవోను ఆయన కలిస్తే ఎమ్మార్సీ వద్దకే వెళ్లాలన్నాడు. ఇటీవల ఆయన్ను కలవగా.. డాక్యుమెంట్లు ఇచ్చేందుకు ఎంఈవోకు రూ.30 వేలు, తనకు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో చేసేదేమీ లేక ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం మధ్యాహ్నం ఎమ్మార్సీ చంద్రశేఖర్ స్కూల్లోనే సిద్దన్న నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాగర్కర్నూల్లో ఉన్న ఎంఈవో చంద్రశేఖర్రెడ్డిని నల్లగొండ ఏసీబీ సీఐ, అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించాక గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చుతామని డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు లింగస్వామి, నర్సింహతోపాటు 10 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఘటన కొల్లాపూర్లో కలకలం రేపింది.