హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): వైకుంఠ ఏకాదశి (డిసెంబర్ 23న) పర్వదినం సందర్భంగా మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఏటా నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఉగాది, ఆణివార అస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు నిర్వహించిన శుద్ధి కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. శతాబ్దాల నాటి ఆలయశుద్ధి, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు. తిరుమంజనం సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 10:30 గంటల వరకు అష్టదశ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.