వరంగల్, ఆగస్టు 3(నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని వైద్య దంత కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. నీట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నెల 4న ఉదయం 6 నుంచి 13వ తేదీ సాయంత్రం 6 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సూచించింది. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. కేఎన్ఆర్యూహెచ్ఎస్. టీఈఎల్ఏఎన్జీఏఎన్ఏ. జీఓవీ.ఐఎన్లో సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
రాష్ట్రంలోని పీజీ డెంటల్ సీట్ల భర్తీకి వరంగల్ కాళోజీ నారాయణరావు విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ను శనివారం విడుదల చేసింది. నీట్-ఎండీఎస్ 2024 పరీక్షలో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఎండీఎస్ కోర్సులో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో ఈ నెల 4న నుంచి 8వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. వివరాలకు http;//www. knruhs.telangana. gov.in సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.