KNRUHS | వరంగల్ : పీజీ డెంటల్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని పీజీ డెంటల్ సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్షా నీట్ ఎండీఎస్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నెల 12వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నిర్ధేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు , ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం యూనివర్సిటీ తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తుంది. మెరిట్ జాబితా విడుదల అనంతరం వెబ్ ఆప్షన్లు నమోదుకు యూనివర్సిటీ మరో ప్రకటన జారీ చేస్తుంది. ప్రవేశాలకు సంబంధించిన ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.