Telangana | గతంలో విద్యుద్దీపాలు లేక నెల్లాండ్ల పాటు చీకట్లో మగ్గిన ఆ వీధులు పక్షానికోసారి వచ్చే పున్నమి వెలుగుల కోసం ఎదురు చూడని రోజంటూ ఉండేది కాదు. ఇప్పుడు ‘తెలంగాణ రేడు’ తెచ్చిన వెలుగు జిలుగుల్లో మెరిసిపోయే వీధుల్ని చూసి పౌర్ణమి రోజూ వస్తే కరెంటు దీపాలను తానూ ఎంజాయ్ చేసేదాణ్ని అని వెన్నెల జాబిలి అనుకోని రోజు ఉండదేమో! ఒక్క వీధిదీపాల వెలుగులే కాదు పల్లె ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని ఊళ్లల్లో అభివృద్ధి వెలుగులు కాంతులీనుతు న్నాయి.. కేంద్ర సర్కారు పురస్కారాలతో నమస్కరిస్తున్నది. ‘చంద్రశేఖరుడు’ పంచుతున్న వెలుగులు తెలంగాణ పొలిమేరల్ని దాటి దేశం యావత్తు విస్తరిస్తున్నాయి. గ్రామస్వరాజ్యం వర్ధిల్లే పాలనను తెలంగాణ అమలు చేస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది.
పిండి కొద్దీ రొట్టె.. నిధులు పుష్కలంగా ఉంటేనే బతుకు బండి సాఫీగా సాగిపోతుంది. అది సగటు మనిషి అయినా, స్థానిక సంస్థలైనా. మెరుగైన జీవితం అనుభవించాలంటే ధనమే ముఖ్యం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేసిందీ అదే. నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేశారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానమైన నిధులను గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయించారు. ఫలితంగా గత నాలుగు దశాబ్దాల్లో సాధించలేని ప్రగతిని తెలంగాణ పల్లెలు ఈ పదేండ్లలోనే చూశాయి.
ఓడీఎఫ్ ప్లస్ రాష్ట్రంగా…
తెలంగాణ 100 శాతం ఓడీఎఫ్ ప్లస్ సాధించిన రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2019లో ఓడీఎఫ్ రాష్ట్రంగా, 2022లో ఓడీఎఫ్ ప్లస్ రాష్ట్రంగా కేంద్రం ప్రకటించింది. పంచాయతీరాజ్ శాఖ అమలు చేసిన ప్రత్యేక కార్యాచరణతో ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11.74 లక్షల ఇంకుడు గుంతలు, 34 వేల కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, 42 లక్షల మూత్రశాలలను నిర్మించారు.
పల్లెలకు పారిన నిధుల వరద…
గ్రామాల రూపురేఖలు మార్చే క్రమంలో నిధుల ఆవశ్యకతను గుర్తించిన రాష్ట్ర సర్కారు.. కేంద్రం ఆర్థిక సంఘం నిధులకు సమానంగా అంతే మొత్తాన్ని జీపీల ఖాతాల్లో జమ చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రూ.16 వేల కోట్లకు పైగా నగదును గ్రామ పంచాయతీలకు చేరవేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా రూ.256 కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్నది. ఇందులో 85 శాతం గ్రామాలు, 10 శాతం మండల పరిషత్తులు, ఐదు శాతం జిల్లా పరిషత్కు కేటాయిస్తున్నారు. చిన్న జీపీలకు కనీస మొత్తం రూ.5 లక్షలు విడుదల చేస్తున్నారు. స్థానిక సంస్థలన్నింటికీ నేరుగా నిధులను బదలాయిస్తున్నారు.
కొత్తగా పంచాయతీలు…
ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా 4,383 కొత్త పంచాయతీలను ఏర్పాటు చేశారు. 1,177 తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చారు. గతంలో రాష్ట్రంలో 8,684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 5,756 జీపీలకు కొత్త భవనాలు అవసరమని గుర్తించారు. 3,686 పంచాయతీలకు సొంత భవనాలను మంజూరు చేశారు. ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున వెచ్చించాలని నిర్ణయిం చారు. వీటన్నింటికీ కలిపి రూ.737 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు.
మన పల్లెలకు జాతీయ అవార్డులు…
పల్లె ప్రగతి, మిషన్ భగీరథ తదితర కార్యక్రమా లతో మార్పు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభ్వుతం రాష్ర్టానికి అత్యధిక అవార్డులు ఇచ్చింది. దీన దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ (డీడీయూపీఎస్వీపీ) 2021-22 జాతీయ పంచాయతీ అవార్డులను ప్రకటించింది. మొత్తం 46 అవార్డుల్లో 13 తెలంగాణ రాష్ర్టానికి దక్కాయి. అంటే 30 శాతం అవార్డులు దక్కాయన్న మాట. ఇప్పటి వరకు దాదాపు 80కి పైగా అవార్డులు రాష్ట్రం సొంతమయ్యాయి.
ట్రాప్లో అన్నీ మనవే…
పార్లమెంట్ సభ్యులు సంవత్సరానికి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016లో సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (ఎస్ఏజీవై) పథకానికి రూపకల్పన చేసింది. ఇలా ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాలకు కొన్ని మార్గదర్శకాలు, ప్రామాణికాలను తీసుకొని స్కోర్ ఇస్తున్నది. దేశవ్యాప్తంగా ఎస్ఏజీవై (సాగి) గ్రామాలకు ర్యాంకులు కేటాయిస్తున్నది. ఈ ర్యాంకు సాధించిన టాప్ 20 గ్రామాల్లో మనవే 19 ఉండడం గర్వకారణం.
పారిశుధ్య కార్మికుల వేతనాలు…
పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు తెలంగాణ వచ్చే నాటికి 2-3 వేలు వేతనాలు మాత్రమే ఉండగా, సొంత రాష్ట్రంలో ప్రభుత్వం మూడు సార్లు పెంచింది. మే డే సందర్భంగా మరో రూ.వెయ్యి పెంచారు. తాజాగా పెరిగిన వేతనాలతో ఆ మొత్తం రూ.9,500 చేరింది. 47 వేల మంది జీపీ కార్మికులు లబ్ధి పొందుతున్నారు.
ఇంటి పన్ను చెల్లించడంలోనూ…
2014-15 ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్ను వసూళ్ల శాతం 62.97 మాత్రమే. 2019-20లో 87.09 శాతం ఉండగా, 2020-21లో 96.63 శాతం, 2021-22లో 97.18 శాతం పన్నులు వసూలయ్యాయి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను మదింపు ఆన్లైన్ విధానంలో ఈ-పంచాయతీ పోర్టల్లో చేశారు. 2022-23 రాష్ట్రం మొత్తం 96.48 శాతం ఇంటిపన్ను వసూలయ్యింది. అత్యధికంగా వంద శాతం ఎనిమిది జిల్లాల్లో పన్ను చెల్లింపులు అయ్యాయి.
ఆడిట్ ఆన్లైన్లో…
పంచాయతీలు ఖర్చు చేసే నిధులను ఆడిట్లో భాగంగా ఆన్లైన్ చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ. మొదటి సారి 2019-20 ఆర్థిక సంవత్సరం ఖర్చుల ఆడిట్ వివరాలను ఆన్లైన్లో పొందుపర్చడం ప్రారంభించింది. 2020, ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం కనీసం 25 శాతం జీపీల నిధులను ఆన్లైన్లో ఆడిట్ చేయాలని నిర్దేశించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం 40 శాతం జీపీల నిధులను ఆన్లైన్ ఆడిట్ నిర్వహించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర అడిట్ అధికారులను ఢిల్లీకి పిలిపించి ఇతర రాష్ర్టాలకు శిక్షణ ఇప్పించింది.
ఉద్యోగులకు ప్రమోషన్లు…
ప్రభుత్వం తెచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాల అభివృద్ధికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు జవాబుదారీగా మా రారు. సర్పంచ్లను సస్పెండ్ చేస్తే స్టే ఇచ్చే అధికారాన్ని మంత్రి నుంచి తొలగించారు. పంచాయతీరాజ్కు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ శాఖలోని 4 వేల మంది ఉద్యోగులు, అధికారులకు ఉద్యోగోన్నతులు లభించాయి. కోర్టు కేసులు, వివాదాలతో సతమతమైన ఉద్యోగులకు దారి చూపింది. ఎంపీడీవోల ప్రమోషన్లకు మోక్షం కలిగింది. ప్రతి గ్రామానికీ కార్యదర్శి ఉం డాలని 9 వేల గ్రామ కార్యదర్శి పోస్టులను ఒకేసారి భర్తీ చేశారు. గ్రామ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండకుండా వాటిని భర్తీ చేసే అధికారాన్ని కలెక్టర్కు అప్పగించారు. వారందరినీ రెగ్యులరైజ్ చేశారు.
గ్రామానికో ట్రాక్టర్…
దాదాపుగా రూ.పది లక్షలతో 12,769 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్లను రూ.1,276 కోట్లతో కొనుగోలు చేశారు. ఇంటింటికీ తిరిగి సేకరించిన చెత్తను డంపింగ్ షెడ్లలో వేసి అక్కడ తడి చెత్త, పొడి చెత్తను వేరు చేస్తున్నారు. దీంతో ప్రతి గ్రామంలో రోగాల బారిన పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.
ఊరూరా వైకుంఠ ధామాలు…
అన్ని మతాల వారు తమ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించుకు నేలా వసతులను కల్పించింది ప్రభుత్వం. ఊరూరా హైదరాబాద్లోని మహాప్రస్థానం తరహాలో వైకుంఠధామాలను నిర్మించింది. 12,745 గ్రామ పంచాయతీల్లో రూ.1,532 కోట్లతో శ్మశానవాటికలు నిర్మించారు. స్నానాల గదులు, నీరు, కరెంటు, రోడ్డు, పార్కింగ్, బర్నింగ్ ప్లాట్ ఫారాలను ఏర్పాటు చేశారు. ప్రహరీలు నిర్మించారు. వెయిటింగ్ హాళ్లు, అస్థికలు నిల్వ చేసుకోవడానికి బాక్సులూ ఉన్నాయి.
డంపింగ్ యార్డులు…
ఊరూరా డంపింగ్ యార్డులు నిర్మించారు. 12,516 గ్రామాలు వర్మి కంపోస్టును తయారు చేస్తున్నాయి. తడి చెత్త నుంచి 34.19 లక్షల కిలోల ఆర్గానిక్ ఎరువును తయారుచేశారు. స్థానిక అవసరాలకు పోనూ మిగతా కంపోస్టు ఎరువులు మార్కెట్లో విక్రయించడం ద్వారా రూ.36.38 లక్షల ఆదాయం సమకూరింది.
పల్లె ప్రకృతి వనాలు…
గ్రామాలు, అనుబంధ ఆవాస ప్రాంతాల్లో మొత్తం 19,472 పల్లె ప్రకృతి వనాలను 13,657 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. వీటిల్లో 2.12 కోట్ల మొక్కలను నాటారు. మండలానికి ఐదు చొప్పున ఇప్పటి వరకు 2,468 బృహత్ పల్లె ప్రకృతి వనాల (బీపీవీ) కోసం స్థలాలను గుర్తించారు. ఒక్కో బీపీవీని 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసి, 1,988 బీపీవీల్లో 1.87 కోట్ల మొక్కలను నాటారు. 19,472 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాల నేది లక్ష్యం కాగా, 15,330 స్థలాలను గుర్తించారు. 13,720 క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పూర్తయ్యింది.
– నెలకుర్తి శ్రీనివాస్ రెడ్డి