దేశంలోనే తొలి ప్రైవేట్ దవాఖానగా రికార్డ్
బేగంపేట, ఫిబ్రవరి 13: హైదరాబాద్లోని కిమ్స్ దవాఖాన దేశంలోనే వెయ్యి మూర్ఛ శస్త్ర చికిత్సలు చేసిన తొలి ప్రైవేట్ దవాఖానగా రికార్డ్ సాధించింది. అంతర్జాతీయ మూర్ఛ దినాన్ని పురస్కరించుకొని ఆదివారం దవాఖానలో నిర్వహించిన కార్యక్రమంలో యాజమాన్యం ఈ అంశాన్ని ప్రకటించింది. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) న్యూఢిల్లీ, శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (త్రివేండ్రం)లో మాత్రమే ఇప్పటి వరకు వెయ్యికి పైగా శస్త్ర చికిత్సలు చేశారు. మందులతో నయంకాని పిల్లలు, పెద్దలకు మాత్రమే శస్త్ర చికిత్స చేస్తారని కిమ్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సీతాజయలక్ష్మీ వెల్లడించారు. దేశంలో ఏటా సుమారు 5 లక్షల మంది చిన్నారులు మూర్ఛ సమస్యతో పుడుతున్నారని, వారిలో 10 శాతం మందికి శస్త్ర చికిత్స అవసరం అవుతున్నదని తెలిపారు. కానీ, దేశంలో ప్రతి వెయ్యి మందిలో ఒక్కరు మాత్రమే శస్త్ర చికిత్సకు ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కిమ్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ మానస్ పాణిగ్రాహి, దవాఖాన ఎండీ డాక్టర్ భాస్కర్రావు పాల్గొన్నారు.