హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఐదేండ్ల బాలుడి గొంతులో స్నాక్స్ ఇరుక్కొని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తగా.. కొండాపూర్లోని కిమ్స్ కడిల్స్ దవాఖాన వైద్యులు చికిత్స చేసి బాలుడిని ప్రాణాపాయం నుంచి తప్పించారు. హైదరాబాద్కు చెందిన బాలుడు రెండు రోజుల క్రితం కాలక్షేపంగా మూంగ్దాల్ స్నాక్స్ తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. విపరీత దగ్గుతోపాటు ఊపిరి పీల్చుకోవడంలో బాలుడు ఇబ్బంది పడటంతో కుటుంబసభ్యులు సమీప పిల్లల దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు అత్యవసర చికిత్స కోసం కొండాపూర్ కిమ్స్ కడిల్స్ దవాఖానకు తరలించారు.
పీడియాట్రిక్ పల్మనాలజిస్టు డాక్టర్ బీ కిరణ్కుమార్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ శుభాకర్ నాదెళ్ల, డాక్టర్ పరాగ్ బాలుడిని పరీక్షించారు. విపరీతమైన దగ్గుతోపాటు కార్బన్డయాక్సైడ్ను బయటకు పంపలేకపోవడం, గాలి చర్మంలోకి, గుండె చుట్టూ ఉండే కణజాలంలోకి లీక్ కావడం వంటి ప్రమాదకర లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించి వెంటనే బ్రాంకోస్కోప్ చేశారు. కుడి, ఎడమ ఊపిరితిత్తుల వాయునాళాల్లో రెండు మూంగ్దాల్ పప్పులు కనబడగా, వాటిని వెంటనే తీసేయడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. పప్పులు, నాణేలు, ఇతర వస్తువులు గొంతులో ఇరుక్కున్నప్పుడు అప్రమత్తం కాకపోతే ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.