హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1, పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కావడంతో అభ్యర్థులు ఇప్పుడంతా పుస్తకాల కోసం పోటీపడుతున్నారు. ముఖ్యంగా తెలుగు అకాడమీ పుస్తకాలకు తీవ్ర డిమాండ్ ఉంటున్నది. ఈ క్రమంలో అభ్యర్థులు పుస్తకాలకోసం కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు గ్రూప్-1 మెయిన్స్కు కీలకంగా ఉపయోగపడుతాయని, ప్రిలిమ్స్ సమయంలో ఇతరత్రా స్టడీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉన్నదని పేర్కొంటున్నారు. ప్రిలిమ్స్ పేపర్లో జనరల్ స్టడీస్, వర్తమాన అంశాలు, కరెంట్ ఆఫైర్స్, జాగ్రఫీ, ఎకానమీ, జాతీయ అంతర్జాతీయ అంశాల నుంచే అధిక ప్రశ్నలు వస్తాయి. ఇందుకోసం అభ్యర్థులు పుస్తకాలు కాకుండా పత్రికలు, వాటిల్లోని వ్యాసాలు, ఆర్టికల్స్ను అవగాహన చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెప్తున్నారు.
తెలుగు అకాడమీ పోటీ పరీక్షల పుస్తకాలు విరివిగానే ముద్రిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం గ్రూప్-1కు రెండు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. సాధ్యమైనంతవరకు పుస్తకాలను వేగంగా అందించే ప్రయత్నం చేస్తున్నది. అయితే.. కేవలం అకాడమీ పుస్తకాలపైనే పూర్తిగా ఆధారపడకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించిన సిలబస్ ప్రకారం ఆయా సబ్జెక్టులను ఇతరత్రా పుస్తకాలు, పత్రికలు, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా అవగాహన చేసుకోవాలని తెలుపుతున్నారు. మరోవైపు పలు అసొసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు సైతం పుస్తకాలను ముద్రించి ఉచితంగా అందజేస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు విరివిగా పుస్తకాల వితరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అనవసరంగా ఆందోళన చెందవద్దని ఓ ప్రొఫెసర్ సూచించారు.