హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): అడవుల పరిరక్షణ, పచ్చదనం పెంపుదలకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ఎంతో బాగున్నదని కేరళ అటవీశాఖ అధికారులు ప్రశంసించారు. రాష్ట్రంలోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ.. అటవీ విద్యను కొత్త పుంతలు తొక్కిస్తుందనడంలో సందేహం లేదని కొనియాడారు. కేరళ ఐఎఫ్ఎస్ అధికారులు కీర్తి, మహమ్మద్ షాబాద్ రాష్ట్రంలో అడువుల సంరక్షణ, పచ్చదనం పెంపుదలకు చేపట్టిన కార్యక్రమాలపై అధ్యయనం చేసేందుకు రాష్ర్టానికి వచ్చారు. రెండు రోజుల పర్యటనలో సిద్దిపేట జిల్లా ములుగు సెంట్రల్ నర్సరీతోపాటు నర్సంపల్లి బ్లాక్లో అటవీ పునరుద్ధరణ, సింగాయపల్లిలో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్, గజ్వేల్ పరిసరాల్లో అవెన్యూ ప్లాంటేషన్, కోమటిబండ మిషన్ భగీరథ ప్రాజెక్టు, పల్లెప్రకృతి వనం, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను సందర్శించారు. అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటిన విధానం చాలా బాగున్నదని, పర్యావరణం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇవి నిదర్శనాలని ప్రశంసించారు. ఔటర్ రింగురోడ్డు వెంట పచ్చదనం పెంపు అద్భుతంగా ఉన్నదని కొనియాడారు.