హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): కేంద్ర జల్శక్తిశాఖ గెజిట్ ప్రకారం నీటిపారుదల ప్రాజెక్టుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నదని, దానిపై బోర్డు సమావేశంలో చర్చించాకనే నిర్ణయం తీసుకుంటామని గోదావరి నది యాజమాన్య మండలి స్పష్టంచేసింది. ఈ విషయాన్ని జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ బీపీ పాండే సోమవారం లేఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి తెలిపారు. ప్రాజెక్టుల ఆస్తుల బదలాయింపు, నిధుల వినియో గం, సీడ్మనీ చెల్లింపు అంశాలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలి పింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను జీఆర్ఎంబీ కేంద్ర జల్శక్తిశాఖ దృష్టికి తీసుకెళ్లగా, కేంద్రం ఇటీవల వివరణ ఇచ్చింది. ఆ వివరాలను జీఆర్ఎంబీ తెలంగాణ సర్కారుకు పంపింది. జల్శక్తిశాఖ గెజిట్ ప్రకారం ప్రాజెక్టుల ఆస్తులను రివర్ బోర్డులకు స్వాధీనం చేయాలని, ఆయా ప్రాజెక్టులపై ఏమైనా రుణాలు ఉన్నట్లయితే వాటిపై ప్రాజెక్టులవారీగా బోర్డ్ మీటింగ్ లో కూలంకశంగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది.
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటి వాటా కన్నా తెలంగాణ 21 టీఎంసీలు తక్కువగానే వినియోగించుకొంటున్నదని తెలంగాణ ప్రభుత్వం తరఫున సాక్ష్యమిస్తున్న సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఘన్శ్యామ్ ఝా తేల్చిచెప్పారు. గణాంకాలతో సహా ఆంధ్రప్రదేశ్కు వివరించారు. ఏపీ పునర్విభజన చట్టం -2014 సెక్షన్ 89 ప్రకారం రెండు రాష్ర్టాలకు నీటి కేటాయింపులకు సంబంధించి బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట గురువారం కూడా విచారణ కొనసాగింది. ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వెంకటరమణి ఆర్డీఎస్, తుమ్మిళ్ల లిఫ్ట్లపై అడిగిన పలు ప్రశ్నలకు ఘన్శ్యామ్ ఝా సమాధానాలు ఇచ్చారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించిందని, మైనర్ ఇరిగేషన్కు కేటాయించిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటున్నదని ఏపీ వాదనకు దిగగా, దాన్ని ఝా కొట్టిపారేశారు. వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం మేరకు తెలంగాణ సర్కారు చెరువులను పునరుద్ధరించిందని స్పష్టంచేశారు. ట్రిబ్యునల్-1 మైనర్ ఇరిగేషన్ కోసం తెలంగాణకు 89.16 టీఎంసీలు, ఏపీకి 22.10 టీఎంసీలను కేటాయించిందని, ప్రస్తుతం తెలంగాణ 68.73 టీఎంసీల నీళ్లే వినియోగించుకొంటున్నదని, తనకు కేటాయించిన నీటి వాటా కంటే అది 21 టీఎంసీలు తక్కువని పేర్కొన్నారు.