జనగామ రూరల్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సతీమణి కల్వకుంట్ల శోభ ఆదివారం జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తి గ్రామానికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి వరంగల్ పర్యటనకు వెళ్తున్న ఆమె.. దారిలో ఆ గ్రామంలో ఆగారు. అక్కడ రోడ్డు పక్కనే ఉన్న గణేష్ హ్యాండ్ క్రాఫ్ట్ షోరూమ్ను సందర్శించారు. ఈ సందర్భంగా షాప్లో ఉన్న బుడిగే శ్రీనివాస్ దంపతులు ఆమెకు సాధారణంగా స్వాగతం పలికారు. ఆమెను షాపులోకి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా కేసీఆర్ సతీమణి షాప్లో ఉన్న హస్తకళలను పరిశీలించారు. మెటల్ షీల్డ్స్ను పరిశీలించి బాగున్నాయని చెప్పారు. అలాగే దేవుళ్ళ ప్రతిమలను చూసి వాటి తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. షాపులో ఉన్న వివిధ రకాల వస్తువులను బుడిగే శ్రీనివాస్ దంపతులు ఆమెకు వివరించి చెప్పారు. అనంతరం జనగామ మార్కెట్ మాజీ చైర్మన్ బాల్దే సిద్ధి లింగం.. కేసీఆర్ సతీమణిని కలిశారు. కేసీఆర్ గారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ సతీమణి పెంబర్తికి వచ్చారని తెలిసి గ్రామస్తులు భారీగా తరలివచ్చారు.