ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని తెలంగాణ ఎలా సమర్థంగా ఎదుర్కొనగలిగింది? ప్రజల ప్రాణాల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చూపే శ్రద్ధ ఎలాంటిది? కార్పొరేట్ దవాఖానలు కూడా చికిత్స చేయలేని బ్లాక్ ఫంగస్ లాంటి భయంకర వ్యాధిని నయం చేయడానికి ముఖ్యమంత్రి యుద్ధ ప్రాతిపదికన ఎలా స్పందించారు? ప్రజల ప్రాణాల పట్ల ఒక ప్రభుత్వాధి నేత నిబద్ధతను పట్టి చూపే ప్రత్యేక కథనం..
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): కరోనా రెండో దశ విజృంభిస్తున్న భయానక సమయమది. బ్లాక్ ఫంగస్ వ్యాధి ఊహించని విధంగా విరుచుకుపడుతున్న రోజులవి. ఈ వ్యాధి నియంత్రణపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. సీఎస్ సోమేశ్కుమార్, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, సీఎం ఓఎస్డీ (ఆరోగ్య) గంగాధర్, తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ చంద్రశేఖర్రెడ్డి తదితర ఉన్నతాధికారులు, వైద్య నిపుణులతో సీరియస్గా చర్చ జరుగుతున్నది. బ్లాక్ఫంగస్ చికిత్సకు ఖరీదైన పరికరాలు కావాలి.. కానీ రాష్ట్రంలో అవి లేవు. తెప్పించాలంటే కనీసం నెలపైనే పడుతుంది! ఎలా! సీఎం మరెవరైనా అయి ఉంటే.. అధికారులకు ఆదేశాలు ఇచ్చి.. తెప్పించమనేవారు! కానీ.. కేసీఆర్ ఏం చేశారంటే..
కంపెనీలకు స్వయంగా సీఎం ఫోన్
సమావేశంలో వైద్యాధికారులు పరిస్థితి తీవ్రతను సీఎం కేసీఆర్కు స్పష్టంగా వివరించారు. ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానల్లో ఎండోస్కోపీ హెచ్డీ కెమెరాలే లేవన్న నిజాన్ని వెల్లడించారు. కోఠి ఈఎన్టీ దవాఖానలో 20 ఏండ్ల కింద కొన్న ఒకే ఒక్క కెమెరా ఉన్నదని తెలిపారు. అధికారులు చెప్పినదంతా సావధానంగా విన్న కేసీఆర్ వైద్యాధికారులను ‘మీకు ఏం కావాలి? ప్రజల ప్రాణాలు నిలువాలి. అందుకోసం ఎంత ఖర్చయినా ఫర్వాలేదు’ అని చెప్పారు. తక్షణం 10 ఎండోస్కోపిక్ హెచ్డీ కెమెరాలతోపాటు మైక్రోడీబ్రెయిడర్లు కూడా అవసరమని అధికారులు తెలిపారు. తక్షణమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించటంతో అధికారులు ముఖముఖాలు చూసుకొన్నారు. నిజానికి ఖరీదైన ఈ పరికరాలను కొనాలంటే ముందుగా బడ్జెట్లో పెట్టాలి. అనుమతులు తీసుకోవాలి. టెండర్లు పిలువాల్సి ఉంటుంది. ఇదంతా జరగడానికి కనీసం నెల రోజులకుపైగానే పడుతుందని అధికారులు చెప్పారు. సీఎం మాత్రం ‘అసలు ఆ పరికరాలు అందుబాటులో ఉన్నాయో లేవో కనుక్కోండి. నేరుగా కంపెనీలతోనే సంప్రదించండి. డబ్బు సంగతి నేను చూసుకుంట. సీఎంగా నాకు విచక్షణాధికారం ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కూడా నిధులు ఉంటాయి’ అని సీఎం చెప్పటంతో అధికారులకు వ్యాధి నియంత్రణపై కొండంత ధైర్యం వచ్చింది. సీఎం అప్పటికప్పుడు ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావుతో మాట్లాడి నిధుల గురించి తెలుసుకున్నారు.
పరికరాలు అందుబాటులో ఉన్నాయో లేవో తెలుసుకొనేందుకు అధికారులు లేవబోతుంటే, ఇక్కడి నుంచే ఫోన్ చేయండి అని సీఎం పురమాయించారు. రిజ్వి, చంద్రశేఖర్రెడ్డి ఈ పరికరాల స్పెసిఫికేషన్ల కోసం కోఠి ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్కు ఫోన్ చేశారు. వీటి తయారీలో స్టార్జ్, ఒలంపస్ కంపెనీలు ప్రపంచంలోనే నంబర్వన్ అని, ఇటలీకి చెందిన స్టార్జ్ కంపెనీ కెమెరాలు దొరికితే మంచిదని ఆయన చెప్పారు. అధికారులు అటు మాట్లాడుతుండగానే సీఎంవో సిబ్బందిని పురమాయించి క్షణాల్లో కంపెనీల నంబర్లు సేకరించారు సీఎం. వెంటనే ఆ ఫోన్ నంబర్లకు కేసీఆర్ స్వయంగా ఫోన్ చేశారు. వ్యాధి తీవ్రతను కంపెనీ ప్రతినిధులకు వివరించి తక్షణం తమకు ఎండోస్కోపిక్ హెచ్డీ కెమెరాలు, మైక్రోడీబ్రెయిడర్లు సరఫరా చేయాలని కోరారు. ఒకటి కాదు, రెండుకాదు ఏకంగా 25 చొప్పున కావాలని సీఎం అడగటంతో అధికారులు నిశ్చేష్టులయ్యారు. స్వయంగా రాష్ట్ర సీఎంఫోన్ చేసి ఒక్కసారిగా 25 కెమెరాలు, మైక్రోడీబ్రెయిడర్లకు ఆర్డర్ అని చెప్పడంతో కంపెనీ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు.
ఖరీదైన వ్యవహారం..
ఒక్కొక్క ఎండోస్కోపిక్ హెచ్డీ కెమెరా ఖరీదు రూ.30 లక్షలకుపైగా ఉంటుంది. మైక్రోడీబ్రెయిడర్లు ఒక్కొక్కటి రూ.13 లక్షల వరకు ఉంటుంది. సీఎం కేసీఆర్ ఫోన్ చేసినప్పుడు కంపెనీల వద్ద కూడా పరికరాలు సిద్ధంగా లేవు. కానీ, స్వయంగా సీఎం ఫోన్ చేయడంతో ఆయా కంపెనీల ప్రతినిధులు సింగపూర్ నుంచి మూడు హెచ్డీ ఎండోస్కోపిక్ కెమెరాలతోపాటు వాటిని అమర్చేందుకు సిబ్బందిని కూడా వెంటనే రాష్ర్టానికి పంపించారు. దీంతో కేవలం 24 గంటల్లోనే మూడు హెచ్డీ కెమెరాలు, మైక్రోడీబ్రెయిడర్లు కోఠి ఈఎన్టీ దవాఖానకు చేరాయి. ఆ తర్వాత వరుసగా హెచ్డీ కెమెరాలు, మైక్రోడీబ్రెయిడర్లు సహా ముఖ్యమైన పరికరాలన్నీ వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలు (టీచింగ్ దవాఖానలు), గాంధీ, నిమ్స్ దవాఖానలకు 25 హెచ్డీ కెమెరాలు సమకూరాయి. వీటి మొత్తం ఖరీదు రూ.10.75 కోట్ల పైమాటే.
సీఎంగా కేసీఆర్ ఉండటంవల్లనే సాధ్యమైంది
ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానలో ఒక్కొక్క వైద్యుడు ఒకేరోజు పదుల సంఖ్యలో బ్లాక్ ఫంగస్ ఆపరేషన్లు చేయగలిగారు. వందలమంది ప్రాణాలు కాపాడగలిగాం. ఇదంతా ప్రభుత్వ ప్రోత్సాహంతోనే సాధ్యమైంది. ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, విలువైన మందులను మాకు ఇచ్చారు. రోజూ కనీసం 20-25 మందికి బ్లాక్ ఫంగస్ ఆపరేషన్లు చేశాం. ప్రైవేటులో రూ.10-20 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్లను ఉచితంగా నిర్వహించాం. కోఠి ఈఎన్టీలోనే వెయ్యికిపైగా ఆపరేషన్లు జరిగాయి. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల రోగులు కూడా వచ్చి వైద్యం చేయించుకొన్నారు. పొసోకొనజోల్ అనే మందు ప్రైవేటులో కొంటే ఒక్కో స్ట్రిప్ రూ.30 వేలు ఉంటుంది. అలాంటిది ఒక్కో రోగికి రూ.1.60 లక్షల విలువైన ఔషధాలను ఉచితంగా అందజేశాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆయా కంపెనీలతో రోజూ మాట్లాడి మందులను తెప్పించారు. బయటి రాష్ర్టాల వైద్యులు కూడా మాకు ఫోన్లు చేసి ఆశ్చర్యపోయారు. మీకు ఇంత పెద్ద మొత్తంలో మందులు, పరికరాలు ఎలా వచ్చాయని అడిగారు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ తెప్పించారని గర్వంగా చెప్పుకున్నాం.
– డాక్టర్ శంకర్, కోఠి ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్.