CM KCR | ఎంత వరకైనా కొట్లాడి మునుగోడులో ప్రతి ఎకరానికి సాగునీరు తెస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించారు. ‘చర్లగూడెం ప్రాజెక్టు పూర్తి కావాలే. ఎవరు చేయాలి ? ఆపుతున్నది ఎవరు? ఒక రాష్ట్రం ఏర్పడితే.. ఒక ఊళ్లో ఇద్దరు అన్నదమ్ముళ్లు వేరుపడితే పెద్దలు ఏం చేస్తరు? ఇది నీదిరా.. గిది నీదిరా అని పంచుతరు.. ఎనిమిదేళ్లవుతున్నది.. మహత్తరమైన ఘనత వహించిన బీజేపీ పార్టీకి, ప్రధాని మోదీకి ఎనిమిదేళ్లు చాలలేదా? మా వాటా ఇవ్వడానికి.. ఎందుకివ్వవు మోదీ? నోరు పెగలదు.. నోరు తెరవదు. నేను మహామొండి మీకు తెలుసు. మునుగోడులోని ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఎక్కడి వరకైనా కొట్లాడి.. తలపెట్టిన ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. వంద పడకల ఆసుపత్రి, చండూరు రెవెన్యూ డివిజన్ కోరుతున్నారని.. ప్రభాకర్రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లోనే మీ కోరిక నెరవేరుస్తా’నన్నారు.
‘గోదలాంటి ప్రభాకర్రెడ్డిలాంటి ఓడగొట్టి గొడ్డలిని తెచ్చిపెట్టుకున్నరు. ప్రజల్లో ఉండే మనిషి, సామాన్యుడు,
అరమరికలు తెలియని మనిషి.. గజకర్ణ గోకర్ణ విద్యలు తెలియని ప్రభాకర్రెడ్డిని పోయిన ఎలక్షన్లలో ఓ గొడ్డలిని తెచ్చిపెట్టుకున్నరు. ఆ గొడ్డలి పుణ్యమాని రోడ్డు.. ఏదీ సక్కగా లేదు. ప్రభాకర్రెడ్డిని గెలిపిస్తే.. అద్దాల్లా రోడ్లను బాగు చేయించే బాధ్యత నాది. పనులు, సేవ చేసేవారు కావాలి. గెలిచినోళ్లు పత్తాలేకుండా పోయారు కానీ.. ఓడిపోయిన ప్రభాకర్రెడ్డి మీ మధ్యలోనే మీ మనిషిగా ఉన్నడు. ఇలాంటోళ్లను గెలిపించుకుంటే మీ పనులు చేస్తరు’ అన్నారు.
‘దేశంలో సక్కదనం ఏముంది. పైనపటారం.. లోనలొటారం.. ఢంబాచారం. మాట్లాడితే విశ్వగురు.. విషగురువా? నరుకుడు నరికితే.. ఇక్కడి నుంచి ఆడిదాకా అరాచక, కిరాచక రాజకీయాలు చేసుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టుకుంటూ.. రాజకీయాలను అస్థిరపరుస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న దుర్మార్గమైన మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలి. మునుగోడు చైతన్యవంతమైన గడ్డ. ఆలోచనలేకుండా గాలికి వేయొద్దు ఓటు. డాలర్కు వ్యతిరేకంగా రూపాయి చూస్తే 82 రూపాయాలా? నేపాల్, పాక్, బంగ్లాదేశ్ కరెన్సీ కన్నా అధ్వాన్నంగా ఉంటదా? ఇండియా ఆకలి రాజ్యంగా మారుతుందా? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్.
‘ఎన్నో ప్రకృతి వనరులు, సంపదలు ఉన్న ఈ దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందా? రూపాయి పతనానికి బాధ్యులు ఎవరు? ధరల పెరుగుదలకు కారణం ఎవరు? సిలిండర్ రూ.1200 చేసింది ఎవడు? పెట్రోల్, డీజిల్ ధరలు పెంచెంది ఎవడు? మరీ మళ్లీ ఓటు వేయాలా? అంత పౌరుషం లేకుండా ఉన్నమా? ఆలోచన చేయాలి. అర్థమై తర్వాత కూడా.. కానట్టు చేస్తే మన బతుకులు వ్యర్థం అవుతాయ్. నడవది మా నాటకం అని బుద్ధి చెప్పాలి సందర్భం వచ్చినప్పుడు. ఆ సందర్భమే మీ చేతిలో ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటును సక్రమంగా వినియోగిస్తే ఇలాంటి వారికి బుద్ధి వస్తుంది. ఈ ప్రైవేటీకరణ నడువది?’ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.