క్రైస్తవులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి మనిషి ఎదుటివారిని ప్రేమించగలగటమే గొప్పలక్షణం, అలా ప్రేమించలేనివారు మనుషులే కాదు. తప్పు చేయాలని ఏ మతం బోధించదు. శాంతి సహనంతో జీవించాలనే మతాలన్నీ చాటిచెప్పాయి. మతం ఉన్మాదంగా మారి కొందరు రాజులు గుళ్లపై, మరికొందరు మసీదులపై దాడులు చేశారు.. వాటివల్ల ఒనగూరిందేమీలేదు. నేడు క్రైస్తవులపై జరుగుతున్న దాడులు కూడా తాత్కాలికమే.. మానవత్వమే కలకాలం కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఏడుపు, బాధ, సంతోషం ఒకేలా ఉంటాయి. దేశ జీడీపీలో అందరి భాగస్వామ్యం ఉంటుంది..అందులో ఎలాంటి రంగులు, తేడాలు ఉండవు.
–సీఎం కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సమాజంలోని ప్రతి ఒక్కరూ శాంతిమార్గంలో నడవాలని, ప్రతి మతం ఇదేవిషయాన్ని చాటి చెప్పిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. మతం ఉన్మాద స్థితికి చేరుకొంటేనే ప్రమాదమని హెచ్చరించారు. తెలంగాణ సమాజ క్షేమం కోసమే అన్ని మతాల వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. క్రిస్మస్ ట్రీని వెలిగించారు. కేక్ కట్చేసి మతపెద్దలకు తినిపించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. క్రైస్తవులకు క్రిస్మస్, నూతన ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి మనిషి ఎదుటివారిని ప్రేమించగలగటమే గొప్పలక్షణమని, అలా ప్రేమించలేనివారు మనుషులే కాదని పేర్కొన్నారు. తప్పు చేయాలని ఏ మతం బోధించదని, శాంతి సహనంతో జీవించాలనే మతాలన్నీ చాటిచెప్పాయని నొక్కిచెప్పారు. మతం ఉన్మాదంగా మారి కొందరు రాజులు గుళ్లపై, మరికొందరు మసీదులపై దాడులు చేశారని, వాటివల్ల ఒనగూరిందేమీలేదని స్పష్టంచేశారు. నేడు క్రైస్తవులపై జరుగుతున్నదాడులు కూడా తాత్కాలికమని, మానవత్వమే కలకాలం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఏడుపు, బాధ, సంతోషం ఒకేలా ఉంటాయని గుర్తుచేశారు. దేశ జీడీపీలో అందరి భాగస్వామ్యం ఉంటుందని, అందులో ఎలాంటి రంగులు, తేడాలు ఉండవని స్పష్టంచేశారు.
క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ, బోనాల పండుగలను అధికారికంగా నిర్వహించాలని తమను ఎప్పుడూ, ఎవరూ అడగలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. అనేక కష్టాలకోర్చి, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకొన్న తెలంగాణలో కులమత బేధం లేకుండా ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్న ఉద్దేశంతోనే అన్ని మతాల వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఇలాగే కొనసాగుతుందని స్పష్టంచేశారు. దాడుల గురించి క్రైస్తవులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎక్కడ, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఏడేండ్లలోనే తెలంగాణ అనేక రంగాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2.37లక్షలని, దేశంలోనే రెండో స్థానమని వివరించారు. అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును ఆవిష్కరించటంతో రైతులు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారని తెలిపారు. ఈ ప్రగతి ఏ ఒక్కరితోనో సాధ్యంకాలేదని, సమిష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు. దేశంలో రంజాన్, దీపావళి, దసరా, క్రిస్మస్ వేడుకలను ఆస్వాదించగలిగే అవకాశమున్న ఏకైక ప్రాంతం తెలంగాణ అని చెప్పారు. క్రైస్తవులు ఎదుర్కొంటున్న చిన్నచిన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రైస్తవులు, క్రైస్తవ సంస్థలకు సీఎం కేసీఆర్ అవార్డులను అందజేశారు. వ్యక్తిగత క్యాటగిరీలో సిస్టర్ లీజి జోసెఫ్, ఎర్పుల జయకర్ డేనియల్, ముల్కల కుమార్ (మంచిర్యాల), ఇదవెల్లి అంజమ్మ (జగిత్యాల), అల్లం ఆరోగ్యరెడ్డి (హైదరాబాద్), మైకేల్ అంటోనియో ఇబ్రహీం, జాన్ మనోజ్కు రూ.లక్ష చొప్పున నగదు బహుమతి అందజేశారు. అదేవిధంగా సంస్థల క్యాటగిరీలో క్యాప్బోల్ ఆర్గనైజేషన్ ఫౌండర్ జీ శ్యామ్సన్ (ఖైరతాబాద్), కేఎం జాన్ (జనగాం), సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీ డీ సుందర్, సెయింట్ పయర్స్ వుమెన్స్ కాలేజీ సిస్టర్ వినంగినికుమారిలకు రూ.2లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి సీఎం కేసీఆర్ సత్కరించారు. అనంతరం మతపెద్దలతో కలిసి సామూహిక విందులో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్కు క్రైస్తవ మతపెద్దలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మంత్రి హరీశ్రావు, సత్యవతి రాథోడ్, సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్టీఫెన్సన్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని, లౌకిక రాష్ట్రంగా దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.