హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్త్రీ, శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణుల కోసం మరో పథకాన్ని అమలు చేయనున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్ అందజేస్తున్న ప్రభుత్వం తాజాగా గర్భిణులకు పౌష్టికాహార కిట్ను అందజేయనున్నది. ఇందులో రూ.1,962 విలువైన మరింత బలవర్ధకమైన పోషకాహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందుకు రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నది. ఒక్కొక్కరికి రెండుసార్లు ఈ కిట్ను అందించనున్నారు. ఈ పథకాన్ని బుధవారం నుంచి అమలు చేయనున్నారు. గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టడం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదగడం, తల్లి ఆరోగ్యం పరిపుష్టిగా ఉండటం లక్ష్యంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్కు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ముందుగా రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో ఈ కిట్లు పంపిణీ చేస్తారు. కిట్ల పంపిణీని కామారెడ్డి కలెక్టరేట్ నుంచి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలిసి వర్చువల్ మోడ్లో ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో మిగతా 8 జిల్లాల్లో జరిగే కార్యక్రమంలో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు
పాల్గొననున్నారు.
ప్రొటీన్స్ , మినరల్స్ , విటమిన్లు అధికంగా ఉండే పోషకాహారం ద్వారా రక్తహీనతను తగ్గించడం, హిమోగ్లోబిన్ శాతం పెంచడం ఈ కిట్ల లక్ష్యం. ఒకో కిట్కు ప్రభుత్వం రూ.1,962 ఖర్చు చేయనున్నది. మొదటి కిట్ను 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ సమయం లో, రెండోకిట్ను 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో ఇవ్వనున్నారు. దాదాపు 1.25 లక్షల మంది గర్భిణులకు పథకం ఉపయోగపడనున్నది. మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
రక్త హీనత (ఎనీమియా) ను నివారించడం వల్ల ప్రసూతి మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న అనేక చర్యల కారణంగా ప్రసూతి మరణాల రేటు 92 నుంచి 43కు తగ్గింది. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని అమలు చేస్తున్నది.
ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళలు తీవ్రమైన రక్తహీనతను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యను అధిగమించేందుకు దేశంలో అత్యుత్తమ విధానాన్ని అనుసరిస్తున్న రాష్ర్టాల్లో అధ్యయనానికి మహిళా ఐఏఎస్ అధికారుల బృందాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పంపించారు. సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, ప్రస్తుత విద్యాశాఖ కార్యదర్శి, పూర్వ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ సహా 8 మంది మహిళా ఐఏఎస్ అధికారులు తమిళనాడు, కేరళ రాష్ర్టాలలో పర్యటించారు. వారి సిఫారసు మేరకు దేశంలో ఎక్కడాలేనివిధంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను రూపొందించారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ గర్భిణులకు వరంగా మారనున్నది.
తల్లి బాగుంటే ఇల్లు బాగుంటుంది. పిల్లలు బాగుంటే భావి భారతం బాగుంటుంది. తల్లీబిడ్డ సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎకడా లేనివిధంగా మన రాష్ట్రంలో పథకాలు ప్రారంభించి, విజయవంతంగా అమలు చేస్తున్నారు. బిడ్డ సంరక్షణ కోసం కేసీఆర్ కిట్.. తల్లి సంరక్షణ కోసం న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నారు. న్యూట్రిషన్ కిట్.. పౌష్టికాహారాన్ని అందించి, తల్లీబిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందించనున్నది.
– వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు