KCR | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హుందాగా వ్యవహరించారు. సీఎం పదవి నుంచి హుందాగా వైదొలిగారు. ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత గెలుపు ఓటముల ట్రెండ్స్ తెలియటంతోనే రాజీనామా లేఖ రాసి రాష్ట్ర గవర్నర్కు అందించాల్సిందిగా సీఎంవో ప్రధాన కార్యదర్శి నర్సింగరావుకు సూచించి, సాధారణ పౌరుడిలా సీఎం నివాసం ప్రగతి భవన్ను నుంచి బయటకు వెళ్లిపోయారు. ‘గెలిస్తే పొంగిపోవడం.. ఓడిపోతే కుంగిపోవటం కాదు ప్రజాప్రతినిధుల అంతిమలక్ష్యం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి’ అని పదేపదే తన క్యాడర్కు చెప్పిన కేసీఆర్ అదే ఆదర్శ విలువను అక్షరాలా అనుసరించారు.
ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడటం మొదలైన తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయానికి పార్టీల గెలుపోటముల ట్రెండ్స్ రావటం మొదలైంది. బీఆర్ఎస్ ఓటమి ఖాయమైందని తెలిసిన వెంటనే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సీఎంవో ప్రధాన కార్యదర్శికి లేఖను అందించి గవర్నర్కు సమర్పించాల్సిందిగా కోరారు. తర్వాత మధ్యాహ్నం మూడు- మూడున్నర గంటల ప్రాంతంలో ప్రగతిభవన్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో సీఎం సీఎస్వో (సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్) కేసీఆర్ దగ్గరికి రాబోతుండగా వద్దని సైగ చేశారు.
తాను తన నియోజకవర్గానికి వెళ్తున్నానని, నియోజకవర్గంలోని తన నివాసానికి వెళ్లే క్రమంలో తనకు కాన్వాయ్ అవసరం లేదని, ట్రాఫిక్ క్లియరెన్స్ విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ను ‘బండి తియ్’ అని చెప్పి ఎలాంటి భద్రత వెంట రాకుండా ఎంపీ వాహనంలో ఎక్కి ప్రగతిభవన్ నుంచి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసానికి బయలుదేరారు. వాహనంలో ముందు ఎంపీ సంతోష్కుమార్, వెనక సీట్లో కేసీఆర్ మాత్రమే ఉన్నారు. ఆ వాహనం వెనుక గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి మరో వాహనంలో కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అనుసరించారు. గన్మెన్లను కూడా కేసీఆర్ వెంట రానీయలేదు.
సీఎం పదవికి రాజీనామా చేసినా మరో ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ప్రభుత్వాధినేతగా వ్యవహరించాలని కేసీఆర్ను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కోరారు. నిజానికి జనవరి 16 వరకు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముందుగా నిర్ణయం తీసుకొన్నారు. కానీ, ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన తర్వాత ఏర్పడబోయే నూతన ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి తన నియోజకవర్గానికి వెళ్లిపోయారు. ప్రగతిభవన్ నుంచి బయలుదేరిన కేసీఆర్ కాన్వాయ్ లేకుండా, ఎలాంటి దర్పా న్ని ప్రదర్శించకుండా అత్యంత సాధారణ పౌరుడిలా పయనం అయ్యారు. ప్రగతిభవన్ నుంచి ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం వరకు ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ వస్తే అన్ని చోట్లా సగటు తెలంగాణ పౌరుడిగా ఆగుతూ హుందతనాన్ని చాటుకొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో వీరోచిత నాయకుడు.. పాలనలో దార్శనికుడు.. రాష్ట్ర సాధన అనంతరం రెండుసార్లు దాదాపు పదేండ్లు ముఖ్యమంత్రిగా తెలంగాణ పేరును ప్రపంచాన సగర్వంగా నిలిపిన నేత.. ఆయనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. పాలకులు ఎవరైనా కేసీఆర్ వేసిన రోడ్మ్యాప్ నుంచి పక్కకు జరగలేని అనివార్యతలను సృష్టించారు. ప్రజాప్రతినిధులు తన పార్టీ వాళ్లు అయినా.. విపక్ష పార్టీలవారైనా ప్రజలందరూ తనవాళ్లుగా భావించి చరితార్థపాలన అందించారు. తెలంగాణ తల్లి గర్వించే బిడ్డగా అటు ఉద్యమంలో.. ఇటు పాలనలో ట్రెండ్సెట్ చేసిన నాయకుడిగా కేసీఆర్ దేశరాజకీయాల్లో అత్యంత పరిపక్వత కలిగిన నాయకుడిగా అనిర్వచనీయమైన సంతకం చేశారు. ఆదివారం ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలించిన అనంతరం ప్రగతిభవన్ నుంచి తన నియోజకవర్గానికి అత్యంత సాధారణ పౌరుడిలా వెళ్లిపోయిన కేసీఆర్ రాజకీయాల్లో అందరికీ ఆదర్శంగా నిలిచారు.