వినేవాడు ఉంటే.. అబద్ధాలను గుదిగుచ్చి దండలా మెడలో ఎంచక్కా వేయొచ్చు, చెవిలో పూలు పెట్టేయొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అదే. కాళేశ్వరంపై అసత్యప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్.. ఇప్పుడు మరో డ్రామాకు తెరలేపింది. నిజాల్ని చాటేందుకు బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు వెళ్తుంటే.. దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు పాలమూరు యాత్ర అంటూ కొత్త నాటానికి తెరతీసింది.
కృష్ణాజలాల్లో హక్కులను కాలరాసి, ప్రాజెక్టులను పండబెట్టి.. పెండింగ్ ప్రాజెక్టులుగా ముద్రవేసి.. పాలమూరును నిలువునా ముంచి జిల్లాను వలసలబాట పట్టించిన కాంగ్రెస్ నేడు తగుదునమ్మా అంటూ నిస్సిగ్గుగా పాలమూరు యాత్ర అంటూ బయలుదేరుతున్నది. పాలమూరుకు అన్యాయం జరిగిపోయిందంటూ గొంతు చించుకున్న కాంగ్రెస్ గతంలో చేసిందేమిటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
Congress | మ్యాకం రవికుమార్/హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): తవ్విచూడాలే కానీ కాంగ్రెస్ పాపాలు అన్నీ ఇన్నీ కావు. ఏమూల వెతికినా పాపాల పుట్టలు కుప్పలుకుప్పలుగా కనిపిస్తాయి. రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని రంగాలను భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ చరిత్రను వెలికితీస్తే అది కొండవీటి చాంతాడు కంటే పెద్దగానే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను దారుణంగా దెబ్బతీసిన నాటి పాలకులు పాలమూరును వలసల జిల్లాగా మార్చారు. ఆ గాయాల నుంచి జిల్లా ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వేళ గాయాన్ని మళ్లీ కెలుకుతున్నారు.
నిజానికి తెలంగాణలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాది ప్రత్యేక స్థానం. దాదాపు 300 కిలోమీటర్ల మేర కృష్ణమ్మ బిరబిరా పరుగులెడుతున్నా గొంతు తడిపేందుకు చుక్కనీరు లేక, పొలాలకు జీవం నింపే సాగునీరు లేక దశాబ్దాలపాటు అల్లాడిపోయింది. జిల్లాలో దాదాపు 35లక్షల ఎకరాలకుపైగా సాగుకు యోగ్యమైన భూములున్నాయి. అప్పర్ కృష్ణా, తుంగభద్ర ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 7 లక్షలకుపైగా ఎకరాలకు సాగునీటిని అందించేందుకు నిజాం ప్రణాళికలను రూపొందించినా, కాంగ్రెస్ పాప ఫలితంగా జిల్లా మొత్తం పడావు పడింది.
దశాబ్దాలుగా పెండింగ్ ప్రాజెక్టులే
కాంగ్రెస్ పాపాల్లో మొట్టమొదట కనిపించేది కల్వకుర్తి-నెట్టెంపాడు ఎత్తపోతల పథకం. ప్రాజెక్టు సర్వే కోసం 1984లో జీవో జారీచేస్తే 1999లో పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. 2003లో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అంటే జీవో జారీ అయిన 20 ఏండ్లకు పనులు ప్రారంభించారు. ఆ తర్వాత పదేండ్లకు కూడా పనులు పూర్తికాలేదు. నిధుల కొరత, భూసేకరణ, అంతర్రాష్ట్ర వివాదాలు.. ఇలా పలు సాకులతో ప్రాజెక్టును అటకెక్కించేశారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ దుస్థితి ఇది.
ఇది కదా.. కేసీఆర్ దీక్ష
తెలంగాణ ఏర్పాటు తర్వాత అనేక సవాళ్ల మధ్య సీఎం అయిన కేసీఆర్ తొలుత దృష్టిపెట్టింది పాలమూరుపైనే. బీడుభూముల్లో నీళ్లు పారించాలన్న లక్ష్యంతో అటకెక్కిన ప్రాజెక్టుల దుమ్ము దులిపారు. ఇంజినీరింగ్ నిపుణులతో సమీక్షించి సమస్యలు పరిషరించారు. క్షేత్రస్థాయిలో తిరుగుతూ పనులను నిరంతర పర్యవేక్షణతో, ప్రాధాన్యత క్రమంలో నిధులను సమకూర్చుతూ, అవసరమైన అనుమతులను సత్వరమే జారీచేస్తూ పెండింగ్ ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించారు.
కేవలం రెండేళ్లలోనే మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టు పనులను 50 శాతం నుంచి 95 శాతానికి పూర్తిచేశారంటే కేసీఆర్ అకుంఠిత దీక్ష ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. 2016-17లో కల్వకుర్తి ద్వారా 1.6 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు ద్వారా 1.2 లక్షల, భీమా ద్వారా 1.4 లక్షల ఎకరాలు, కోయిల్సాగర్ ద్వారా 8 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు.. మొత్తంగా నాలుగు ఎత్తిపోతల పథకాల ద్వారా 5 లక్షల ఎకరాలకు తొలిసారిగా సాగునీటిని అందించిన ఘనత కేసీఆర్దే. క్రమంగా డిస్ట్రిబ్యూటరీల పనులను పూర్తి చేశారు. నేడు ప్రాజెక్టుల కింద నికరంగా 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
కేసీఆర్ ఉక్కు సంకల్పం
కృష్ణా జలాల్లో న్యాయమైన నీటి వాటా కోసం తెలంగాణ ఉద్యమంలో నాటి ఉద్యమనేతగా, తొమ్మిదిన్నరేండ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన గళాన్ని బలంగా వినిపించారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా, అడ్డుకోవాలని చూసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును దృఢసంకల్పంతో ముందుకు తీసుకెళ్లారు.
ఉమ్మడి పాలకులు 8.8లక్షల ఎకరాలతో జూరాల నుంచి ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తిగా ఇంజినీరింగ్ నిపుణులతో కలిసి అధ్యయనం చేయించారు. ప్రాజెక్టు ప్రతిపాదిత ఆయకట్టును 12.30లక్షలకు పెంచడంతోపాటు, ఇన్టేక్ పాయింట్ను జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చి వెంటనే పరిపాలన అనుమతులను మంజూరు చేశారు. 2015లోనే ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయడం విశేషం.
పోలవరం డైవర్షన్ ద్వారా అందుబాటులోకి వచ్చే 45టీఎంసీలను, మైనర్ ఇరిగేషన్ కింద ట్రిబ్యునల్ కేటాయించిన 89 టీఎంసీల్లో వినియోగించకుండా ఉన్న 45 టీంఎసీలను మొత్తం 90టీఎంసీల నికర జలాలను కేటాయించడం విశేషం. ఆ వెంటనే ప్రాజెక్టు డీపీఆర్ను సిద్ధం చేసి కేంద్ర పర్యావరణ శాఖకు సమర్పించడమేకాదు, అనుమతుల సాధనే లక్ష్యంగా ఢిల్లీలో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసి సిబ్బందిని సైతం నియమించడం కేసీఆర్ ప్రభుత్వ చిత్తశుద్ధికి, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తుంది. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎట్టకేలకు పర్యావరణ అనుమతులకు సంబంధించి ఈఏసీ గ్రిన్ సిగ్నల్ ఇచ్చింది. అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణశాఖకు సిఫారసు చేసింది. ఇప్పటికీ 4 నెలలు గడచినా అది అక్కడే పెండింగ్లో ఉన్నది. దానిపైనా ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఒక్కసారి కూడా దృష్టి సారించకపోవడం గమనార్హం.
కాలువలు తవ్వితే చాలు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) రూ.35వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మొదటిదశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్కర్నూలు జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రాజెక్టు పనులను మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా, కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది.
ప్రస్తుతం ఆయా ప్యాకేజీల పనులన్నీ దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. రిజర్వాయర్లన్నీ పూర్తయ్యాయి. వాటి నుంచి కాలువలను తవ్వితే చాలు ప్రాజెక్టు ద్వారా 16 నియోజకవర్గాల్లో 70 మండలాల్లో 1226 గ్రామాలకు తాగునీరు, 12.30లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పనులను ఎక్కడికక్కడ నిలిపేసింది. రాజకీయకక్షతో, సొంత ఇమేజ్ కోసం పాలమూరు కాలువ పనులను వదిలి ఇతర ప్రాజెక్టులను చేపడుతున్నది.
జీవోలు ఇచ్చేందుకూ అడ్డంకులే
2005లో పాలమూరు-రంగారెడ్డి పథకానికి రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం రూపకల్పన చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రాజెక్టు సర్వే పనులకు జీవో ఇవ్వడానికి సైతం అనేక అడ్డంకులను సృష్టించింది. రాష్ట్రం ఏర్పాటు అయ్యేంతవరకూ ఆ పనులు ముందుకు సాగకుండా నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే అడుగడుగునా అడ్డుకుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా పాలమూరును నట్టేట ముంచేందుకు కాంగ్రెస్ చేయని యత్నమంటూ లేదు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు చేపట్టగానే అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.
ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రాజెక్టుపై దాదాపు 40కి పైగా కేసులను ఇటు సుప్రీంకోర్టులో, అటు ఎన్జీటీలో వేయించింది. మరోవైపు రైతులను పక్కదోవ పట్టిస్తూ, ప్రభుత్వంపైకి ఎగదోస్తూ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డుకునేందుకు విఫలయత్నాలు చేసింది. తెలంగాణ ఉద్యమ ధాటికి, బీఆర్ఎస్ ఒత్తిడితో ఎట్టకేలకు అయిష్టంగానే 2013లో ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతూ జీవోను జారీ చేసింది.
ఒక్క పాలమూరుతోనే 67.97టీఎంసీల నిల్వ
ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు ఏపీలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకున్నారే తప్ప, తెలంగాణ భూభాగంలో ఎక్కడా నీటి నిల్వను పట్టించుకోలేదు. ఉమ్మడి ఏపీలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిల్వసామర్థ్యం మొత్తంగా 1232 టీఎంసీలుంటే అందులో ఏపీకి 827 టీఎంసీలు, తెలంగాణలో 302 టీఎంసీలు ఉండడం తెలంగాణపై నాటి పాలకులకు ఉన్న ప్రేమకు నిదర్శనం. భౌగోళిక, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నీటి నిల్వ సామర్థ్యం ఎకువగా తెలంగాణలోనే ఉండాలి.
కానీ దాన్ని సీమాంధ్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందుకు కృష్ణా నదిపై ఉన్న జూరాల ప్రాజెక్టే ఉదాహరణ. రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణా బేసిన్లో మొత్తం తెలంగాణ నీటి నిల్వ సామర్థ్యం 8టీఎంసీలు కాగా, ప్రస్తుతం నిర్మిస్తున్న ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోనే 67.97 టీఎంసీల నిల్వసామర్థ్యం పెరుగుతుండడం విశేషం. నికరంగా కృష్ణా బేసిన్లో నీటి నిల్వసామర్థ్యం 75.94టీఎంసీలకు పెరగనుంది. ఇవిగాకుండా ఇప్పటికే చెక్డ్యామ్లు, చెరువుల పునరుద్ధరణతోనూ కృష్ణా బేసిన్లో నీటినిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించారు.
పాలమూరు ప్రాజెక్టుల రిజర్వాయర్లు
అంజనగిరి (నార్లాపూర్)
కట్ట మొత్తం పొడవు: 11.02కి.మీ.
ఎత్తు: 74మీటర్లు
నీటి నిల్వ సామర్థ్యం: 8.41టీఎంసీలు.
ఎఫ్ఆర్ఎల్: 345
వీరాంజనేయ (ఏదుల)
కట్ట మొత్తం పొడవు: 12.40 కి.మీ.
ఎత్తు: 38మీటర్లు
నీటి నిల్వ సామర్థ్యం: 6.55 టీఎంసీలు
ఎఫ్ఆర్ఎల్: 445
వెంకటాద్రి (వట్టెం)
కట్ట మొత్తం పొడవు: 15.23 కి.మీ.
ఎత్తు: 57మీటర్లు.
నీటి నిల్వ సామర్థ్యం: 16.74 టీఎంసీలు
ఎఫ్ఆర్ఎల్: 542
కురుమూర్తిరాయ (కరివెన)
కట్ట మొత్తం పొడవు: 14.12 కి.మీ.
ఎత్తు: 61మీటర్లు.
నీటి నిల్వ సామర్థ్యం: 17.34టీఎంసీలు
ఎఫ్ఆర్ఎల్: 531
ఉద్దండాపూర్
కట్ట మొత్తం పొడవు: 15.87 కి.మీ.
ఎత్తు: 57.99 మీటర్లు.
నీటి నిల్వ సామర్థ్యం: 16.03టీఎంసీలు.
ఎఫ్ఆర్ఎల్: 629మీటర్లు (రాష్ట్రంలో
ఇప్పటివరకు ఇదే అత్యధిక ఎత్తులో ఉన్న రిజర్వాయర్)