KCR | పదేళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కరువు తాండవిస్తున్నది. ఎక్కడ చూసిన వరి పొలాలు నీరందక ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో రైతులకు భరోసానిచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత మరో రైతు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ధరావత్ తండాలో ఎండిన పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో ఆయన మాట్లాడారు. దుఃఖంలో ఉన్న రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాక నాలుగు ఎకరాల పంటను కోల్పోయిన మహిళా ఆంగోతు సత్తెమ్మ కేసీఆర్ ఎదుట తన గోడును వెళ్లబోసుకున్నది.
బోర్లు వేసి నీళ్లు రాక పంటలు ఎండిపోయి దాదాపు రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు అప్పు అయ్యిందని కేసీఆర్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని పంట ఎండిపోవడంతో చేతిలో చెల్లి గవ్వలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నానని సమస్యను ఏకరువు పెట్టారు. స్పందించిన బీఆర్ఎస్ అధినేత సత్తెమ్మ కుమారుడి వివాహ ఖర్చు నిమిత్తం రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. రైతులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. పోరాడి మన నీళ్లను మనం సాధించుకుందామని.. 24 గంటల కరెంటును సాధించుకుందామని పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీ, రైతుబంధు పోరాడి సాధించుకుందామన్నారు.