హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ పోస్టర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఆవిష్కరించారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయులందరికీ బీఆర్ఎస్ ఆవిర్భావం, సీఎం కేసీఆర్ తెలంగాణాలో చేసిన అభివృద్ది, కేసీఆర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి క్రికెట్ టోర్నమెంట్ను ఎంచుకున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ఈ టోర్నమెంట్లో దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొంటాయని, తద్వారా దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే కేసీఆర్ అజెండా ఎన్నారైలకి చేరుతుందని వెల్లడించారు. బీఆర్ఎస్ ఆవశ్యకతను ఆస్ట్రేలియాలోని భారతీయులకు తెలియజేసేలా కృషి చేస్తున్న బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డిని ఈ సందర్భంగా కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో బాబా ఫసీయుద్దీన్, సేనాపతి రాజు, కళ్లెం హరికృష్ణారెడ్డి, రమేశ్చారితోపాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.