హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): బ్యాంకులను మోసం చేసిన కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్బీఎల్) ఉపాధ్యక్షుడు శ్రీకృష్ణ గురజాడను మంగళవారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండస్ఇండ్ బ్యాంక్ను రూ.137 కోట్లు మోసం చేసిన కేసులో కార్వీ చైర్మన్ పార్థసారథితోపాటు సీఈవో రాజీవ్ రంజన్ సింగ్, సీఎఫ్వో కృష్ణ హరితలను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బ్యాంకుల నుంచి రుణాలు పొంది 9 బినామీ కంపెనీల ద్వారా ఒక పథకం ప్రకారం ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. డిమ్యాట్ ఖాతాల గురించి ఎక్సేంజీలకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఖాతాదారులను మోసం చేయడమే కాకుండా బ్యాంకులనూ ముంచేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు దర్యాప్తులో భాగంగా వైస్ ప్రెసిడెంట్ పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో ఏసీపీ హరికృష్ణ నేతృత్వంలోని బృందం శ్రీకృష్ణను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచింది.