హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండీ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement directorate- ఈడీ) అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీకి అనుమంతించింది. దీంతో చంచల్గూడ జైలులో ఉన్న ఆయనను.. వైద్య పరీక్షల అనంతరం ఈడీ కార్యాలయానికి తరించారు. మనీలాండరింగ్ వ్యవహారంపై ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
పెట్టుబడిదారుల షేర్లను తనఖా పెట్టి బ్యాంకు రుణాలు పొందినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సీసీఎస్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు సోమవారం ఉదయం బెంగళూరులో పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. అటునుంచి హైదరాబాద్కు తరలించిన విషయం తెలిసిందే.
కార్వీలో జరిగిన కుంభకోణంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పార్థసారథితోపాటు ఇతర డైరెక్టర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ సెప్టెంబర్, అక్టోబర్ల్లో కార్వీకి చెందిన 14 కార్యాలయాలు, ఎండీ, ఇతర కీలక వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేసింది. కాగా, కార్వీ షేర్లు కొన్న మదుపరుల పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా వారికి తెలియకుండా షేర్లను తన వ్యక్తిగత ఖాతాలోకి బదలాయించుకుని వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.3 వేల కోట్లు రుణంగా పార్థసారథి పొందినట్టు ఈడీ గుర్తించింది.