కరీంనగర్ : ప్రజల అరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాలో రెండో డోస్ వ్యాక్సినేషన్ ను 100.19 శాతం పూర్తిచేసి రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపినందున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఒకప్పుడు కల్లోల జిల్లాగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇప్పుడు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతుందని అన్నారు. 2001 సంవత్సరంలో సింహగర్జనను కేసీఆర్ కరీంనగర్ లోనే ప్రారంభించిన అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. కాళేశ్వరం జలాలతో నేడు రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా సాగు అవుతుందని పేర్కొన్నారు.
గతంలో కరోనా అనగానే భయపడ్డ కరీంనగర్ నేడు కరీంనగర్ ను చూసి కరోనా భయపడే స్థాయికి చేరిందని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది, ఎఎన్ఎం లు, ఆశ వర్కర్లు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో రెండో డోస్ వ్యాక్సినేషన్ ను 100శాతం పూర్తిచేయడం అభినందనీయమని అన్నారు.
ఇదే క్రమంలో 3వ దశ కోవిడ్ ను కూడా కట్టడి చేసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ విజయం సీఎం కేసీఆర్ కే అంకితం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
కొవిడ్ కు భయపడవద్దని ధైర్యమే మందుగా భావించి ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.