కంటి సమస్యలు ప్రత్యక్ష్యంగా మనిషికే కాదు.. పరోక్షంగా ఆర్థిక వ్యవస్థకూ నష్టదాయకమేనని ఐక్యరాజ్య సమితి గుర్తింపుపొందిన ప్రఖ్యాత సంస్థ ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ (ఐఏపీబీ)’ తాజాగా వెల్లడించింది. అయితే, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదేండ్ల క్రితమే గుర్తించారు. ‘కంటి వెలుగు’ పేరిట బృహత్తర మిషన్కు అంకురార్పణ చేసి.. అంధత్వరహిత తెలంగాణకు బాటలు వేశారు. తద్వారా పౌరుల కంటి సమస్యలకు చెక్ పెట్టి.. వారి ఉత్పాదకత శక్తిని పెంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం చేస్తున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 12 ( (స్పెషల్ టాస్క్ బ్యూరో నమస్తే తెలంగాణ): నివారించడానికి వీలున్న అంధత్వ సమస్యలను ని ర్లక్ష్యం చేయటంవల్ల ప్రజల ఉత్పాదకత కుంటుపడుతున్నదని, దీంతో ఏటా దేశ ఆర్థిక వ్యవస్థకు 2.24 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు తేలింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ (ఐఏపీబీ) ఓ నివేదికలో వెల్లడించింది. దేశంలో దాదాపు ఏడు కోట్లమంది కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు చెప్పింది. ప్రజల్లో నివారించగల అంధత్వ సమస్యలను గుర్తించి, చికిత్స అందించడంలో ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించింది.
నివారింపడానికి వీలున్న కంటి సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ‘కంటివెలుగు’ పేరుతో 2018 ఆగస్టు 15న ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అంధత్వరహిత తెలంగాణే లక్ష్యంగా తొలి విడతలో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి, 44 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసింది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభించిన రెండో విడతలో 1.6 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 40 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు ఇచ్చింది. రెండు విడతల్లో లక్షలాది మందికి ఆపరేషన్లు చేసింది. దేశంలో ప్రజలందరికీ మూకుమ్మడిగా, ఒక ఉద్యమంలా కంటి పరీక్షలు నిర్వహించటం తెలంగాణలోనే మొదలైంది. ఇలాంటి కార్యక్రమాల్లో కంటివెలుగు పథకమే మొదటిది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అబ్బురపడి.. ఢిల్లీలో కంటివెలుగును నిర్వహిస్తామని ప్రకటించారు.
‘కంటి వెలుగు’ మిషన్తో రాష్ట్రంలోని మెజారిటీ ప్రజల కంటి సమస్యలు పరిష్కారమయ్యాయి. ముఖ్యంగా ఈ పథకంతో ఉద్యోగులు, కార్మికులకు మేలు చేకూరింది. తద్వారా ఉత్పాదకత కూడా ఆ స్థాయిలోనే పెరిగింది. ఫలితంగా జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ అతితక్కువ సమయంలోనే కొత్త రికార్డులను నమోదు చేసింది. ఎలాంటి కంటి సమస్యలు లేకపోతే ప్రజల జీవన నాణ్యత పెరుగుతుంది. ఇతరుల మీద ఆధారపడటం తప్పుతుంది. దీంతో ఉత్సాదకత పెరిగి.. అది ఆర్థికవ్యవస్థ వృద్ధిలో ప్రతిఫలిస్తుంది.