హైదరాబాద్ : అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా కందగట్ల స్వామి ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్లో సంఘం ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 913 ఓట్లు ఉండగా కందగట్ల స్వామికి 553 ఓట్లు పోలయ్యాయి. దీంతో కందగట్ల స్వామి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి లక్ష్మీనారాయణ ప్రకటించారు.
ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న పద్మశాలీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి రాజ్యాధికారం సాధించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. చేనేత, పవర్ లూమ్ కార్మికుల సమస్యలపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేయనున్నట్లు చెప్పారు. చేనేతకు జీరో జీఎస్టీ సాధన కోసం జాతీయ స్థాయిలో జరుగుతున్న ఉద్యమాన్ని మరింత తీవ్రస్థాయిలో ముందుకు తీసుకెళ్తాన్నని చెప్పారు. గత 20 సంవత్సరాలుగా జాతికి అంకితమై పని చేస్తున్నానని, ఇక నుంచి కూడా నిరంతరం జాతి అభ్యున్నతి కోసం కృషి చేస్తానన్నారు. ప్రతిభ గల పేద పద్మశాలి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కాకుండా చూస్తానని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పూర్వ అధ్యక్షుడు శ్రీధర్ సుంకుర్ వార్ మాట్లాడుతూ.. స్వామి అనే వ్యక్తి పూర్తి కాలం కార్యకర్తగా తనతో ఐదు సంవత్సరాలు కలిసి పని చేశారని, ఇక ముందు కూడా సంఘ నిర్మాణానికి కృషి చేస్తారనే పూర్తి విశ్వాసం తనకు ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శి గడ్డం జగన్నాథం, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, చేనేత విభాగం అధ్యక్షులు యర్రమాద వెంకన్న నేత, రాయలసీమ ప్రాంతం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ, కోస్తాంధ్ర అధ్యక్షుడు జీవీ నాగేశ్వరరావు, వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బర్రెంకల మధుసూదన్, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్, ఆలిండియా కోశాధికారి వనం విశ్వనాథ్, పోపా అధ్యక్షుడు గండూరి వెంకట్, శ్యామల సహదేవ్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కర్నాటి శ్రీనివాస్, ఆలిండియా యువజన సంఘం అధ్యక్షుడు గుండేటి శ్రీధర్, పోపా విభాగం ఆలిండియా అధ్యక్షుడు గంగాధర్ తిలక్, ప్రజాస్వామ్య అద్యక్షుడు బోల్ల శివశంకర్, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు కత్తుల సుదర్శన్, యువజన సంఘం కోశాధికారి తెలంగాణ సాయి, రాజయోగి, చిక్కా దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.