యాదాద్రి, నవంబర్ 18 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవ సేవ కన్నుల పండువగా సాగింది. ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహనంపై మాడ వీధుల్లో ఊరేగించారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3:30 గంటలకు స్థాన సుప్రభాతాన్ని ఆలపించి స్వామివారిని మేల్కొలిపారు. స్వామివారికి తిరువారాధన చేపట్టి బాలభోగం నివేదన చేశారు. నిత్యబలి ప్రదానం మంగళాశాసనంతో ప్రాబోధిక కార్యక్రమానికి ముగింపు పలికి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం వెండి తిరువీధి సేవ, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. కార్తికమాసం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. 1,137 మంది దంపతులు సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే దీపారాధన పూజలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామివారిని సుమారు 36 వేల మంది దర్శించుకోగా, ఖజానాకు రూ.39,79, 146 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.
మస్కట్లో వైభవంగా నర్సన్న కల్యాణోత్సవం
ఒమన్ దేశ రాజధాని మస్కట్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణాలయంలో స్వామి, అమ్మవార్లను ముస్తాబు చేసి కల్యాణతంతు జరిపారు. ఆశీర్వచనం, ఆరగింపు, తీర్థ ప్రసాదాల గోష్టి చేపట్టి ఉత్సవాలకు ముగింపు పలికారు. ఏటా మస్కట్ లక్ష్మీనరసింహస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో జరిగే స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలో గుట్ట ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, సిధార్థ తదితరులు పాల్గొన్నారు.