హైదరాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ చాంబర్లో ప్రొటెం చైర్మన్ జాఫ్రీ కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎన్నికైన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన 12 స్థానాల నుంచి గెలుపొందిన వారి పదవీ కాలం ఈ నెల 5 నుంచి అమల్లోకి వచ్చింది. కవిత, దామోదర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా.. మరో పది మంది ఎమ్మెల్సీలు ప్రమాణం స్వీకారం చేయాల్సి ఉన్నది. ఈ సందర్భంగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు కవిత కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.