కాశీబుగ్గ/పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 10: ప్రజాకవి కాళోజీ నారాయణరావు కుమారుడు రవికుమార్ (70) అనారోగ్యంతో కన్నుమూశారు. శనివారం కాళోజీ జయంతి నిర్వహించగా ఆదివారం ఆయన కుమారుడు మరణించారు. వరంగల్లోని ప్రతిమ క్యాన్సర్ దవాఖానలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న రవికుమార్ ఆదివారం మృతి చెందారు. ఈయన ఆంధ్రాబ్యాంక్ రిటైర్డు ఉద్యోగి. సాహితీవేత్తగా కొనసాగారు. ఆయనకు భార్య వాణి, కుమారుడు ఉన్నారు. భౌతికకాయాన్ని హనుమకొండలోని నక్కలగుట్టలోని ఆయన నివాసానికి తరలించారు.
సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. కాళోజీ రవికుమార్ మృతిపట్ల కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. కాళోజీ ఫౌండేషన్, మిత్ర మండలి సభ్యులు నాగిళ్ల రామశాస్త్రి, జీవన్కుమార్, డాక్టర్ అంపశయ్య నవీన్, బీ నర్సింగరావు, వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, పందిళ్ల అశోక్కుమార్, జితేందర్రావు, ఆచార్య బన్న అయిలయ్య, ఆగపాటి రాజ్కుమార్, సిరాజుద్దీన్, ఎన్వీఎన్ శాస్త్రి తదితరులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.