ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్ లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జనవరి 5 ఉదయం 8 గంటల నుండి 11 వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విశ్వవిద్యాలయం అధికారులు సూచించారు.
నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి, వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఆన్లైన్ లో సమర్పించిన దరఖాస్తులు , సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. మెరిట్ జాబితా విడుదల అనంతరం వెబ్ ఆప్షన్లకు యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. తదనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.