హైదరాబాద్, ఆగస్టు1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లిలో కాకతీయ ప్రతాపరుద్రుడికి సంబంధించిన తమిళశాసనం ఉన్నదని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక కోదండరామాలయాన్ని సందర్శించిన ఆయన గోపురగోడపై ఉన్న శాసనాన్ని పరిశీలించారు.ఈ శాసనం ప్రకారం.. కాకతీయ ప్రతాపరుద్రుడికి పుణ్యంగా మోటుపల్లిలోని రాజనారాయణ్ పెరుమాళ్ క్రీ.శ.1308 ఆగస్టు 1న ఆలయ నిర్మాణం కోసం భూమిని దానం చేసినట్టు తెలుస్తున్నదన్నారు. మోటుపల్లి వీరభద్రాలయంలో క్రీ.శ.1244లో కాకతీయ గణపతిదేవుడు సముద్ర వ్యాపారుల భద్రత కోసం వేయించిన అభయశాసనం ఒకటి తెలుగు, సంస్కృత, తమిళభాషల్లో ఉన్నదని పేర్కొన్నారు. ఈ శాసనం వేసిన 64 ఏండ్లకు ప్రతాపరుద్రుడు తమిళశాసనాన్ని వేయించారని పేర్కొన్నారు. కోదండరామస్వామి గర్భాలయ అధిష్ఠానంలోని కుముదవర్గంపై దాదాపు 10 తమిళ శాసనాలున్నాయని, వాటి నకళ్లు తీసి, చారిత్రక విషయాలను కనుగొనాలని కేంద్ర పురావస్తుశాఖ, శాసన విభాగ సంచాలకుడు డాక్టర్ కే మునిరత్నంరెడ్డిని కోరారు.