వరంగల్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): హనుమకొండ జిల్లా కాజీపేటలోని హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గాలో సోమవారం నుంచి ఉర్సు మొదలవుతున్నది. మూడు రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించనుండగా.. వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. వందల ఏండ్లుగా ఈ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది. సోమవారం రాత్రి 11.30 గంటలకు ఉర్సు మొదలవుతుంది. ప్రధాన ఘట్టం సంధల్ ఊరేగింపు. దీనికి వేలాది భక్తులు వస్తారు. భక్తులు గంధం తీసుకుని వచ్చే ఘట్టం కోసం గంటల తరబడి వేచి చూస్తారు. తలపై గంధంతో మేళతాళాల మధ్య దర్గాలోకి వెళ్తున్న దర్గా పీఠాధిపతిని, ఆయన తలపై ఉన్న గంధంతో ఉన్న వెండి గిన్నెను తాకడానికి భక్తులు పోటీపడతారు. ఆ గంధం గిన్నెను తాకితే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఆ రోజు ఉదయం వరకు ఖవ్వాలి వినిపిస్తారు. మంగళవారం ఉర్సు జరుగుతుంది. బుధవారం బదావా పేరుతో ఉర్సు ముగింపు ఉంటుంది. ముగింపు కార్యక్రమంలో ఫకీర్ల విన్యాసాలు ఉంటాయి.