హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ విద్యాకమిషన్ సమర్పించిన నివేదికపై అనేక అభ్యంతరాలున్నయ్.. కమిషన్ సిఫార్సులపై నాకూ అనేక సందేహాలున్నాయ్’ అని ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కమిటీ చైర్మన్ కే కేశవరావు (కేకే) అభిప్రాయపడ్డారు. నివేదిక విషయంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పరిధి దాటి వ్యవహరించారని కేకే నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువ ఉన్నాయని ఆయన అనాల్సింది కాదని, ఆ అంశాన్ని ప్రస్తావించకుండా ఉండాల్సిందని తెలిపారు.
విద్యాకమిషన్ నివేదికపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బుధవారం సచివాలయంలో కేకే మీడియాతో మాట్లాడారు. ఆకునూరి మురళి నేతృత్వంలోని తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన నివేదికపై సందేహాలు, భిన్నాభిప్రాయాలున్నాయని పేర్కొన్నారు. ఈ కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలా? లేదా? అన్న విషయంపై తాము అధ్యయనం చేస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల వేతనాలపై కమిషన్ ప్రస్తావించడంతో కాంట్రవర్సికీ దారితీసిందని చెప్పారు.
సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో తీవ్ర విమర్శలొచ్చాయని తెలిపారు. టీచర్ల వేతనాలపై ఆకునూరి మురళి వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయం మాత్రమేనని, ప్రభుత్వానికి సంబంధంలేదని తేల్చి చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం జోలికి కూడా వెళ్లకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు. త్వరలోనే తాను ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించి, వారి అభిప్రాయాలను తీసుకుంటానని చెప్పారు. తాము మౌలిక వసతుల కల్పన అంశంపైనే అధ్యయనం చేయాలని సూచిస్తే, ఆకునూరి మురళి కమిషన్ అన్ని అంశాలను స్పృశించి నివేదికను సమర్పించిందని పేర్కొన్నారు. విద్యా కమిషన్ తన పరిధి దాటిందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. టీచర్ల పనిని జీతంతో కొలువలేమని, ఆ టీచర్ల జీతాలను తగ్గించబోమని కూడా చెప్పారు.
విద్యాకమిషన్ నివేదికపై అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతున్నది. మొత్తంగా ‘ఆకునూరి అత్యుత్సాహమే కొంప ముంచింది’ అన్న అభిప్రాయంలో సర్కార్ వర్గాలు ఉన్నాయి. ఈ నివేదికపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు ముప్పేట దాడిచేస్తుండటం, సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తుండటంతో సర్కార్కు ఊపిరి సలుపడంలేదు. ఆయన రెండేండ్ల పదవీకాలం సెప్టెంబర్లో ముగియనున్నది. ఆ తర్వాత ఆయన్ను కొనసాగించొద్దన్న అభిప్రాయంతో సర్కార్ పెద్దలున్నట్టు సమాచారం. నష్టనివారణ చర్యల్లో భాగంగా బుధవారం ఆగమేఘాలపై ప్రభుత్వ సలహాదారు కేకేను రంగంలోకి దింపి టీచర్ల వేతనాలు తగ్గించబోమని ప్రకటన చేయించారు.
విద్యా కమిషన్ వివాదాస్పద సిఫార్సుల అనంతర పరిమాణాలపై ఉపాధ్యాయ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఆ వర్గాల్లో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ పెద్దల వ్యవహారంపై టీచర్లు మండిపడుతున్నారు. అసలింతకు టీచర్ల జీతాలు ఎక్కువున్నాయి.. తగ్గించాలని చెప్పేందుకు ఆకునూరి మురళి ఎవరు? జీతాలు తగ్గించబోమని చెప్పేందుకు కేశవరావు ఎవరు? అని ఓ ఉపాధ్యాయుడు ప్రశ్నించారు. ఇంతకు జీతాలు నిర్ణయించేదెవరు? అంటూ మరో ఉపాధ్యాయుడు ఫైర్ అయ్యారు. పీఆర్సీ కమిటీ చెప్పాల్సిన విషయాన్ని సర్కార్ పెద్దలు చెప్పడమేమిటని పెద్ద ఎత్తున ఉపాధ్యాయ వర్గాలు నిలదీస్తున్నాయి.