హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ)/హనుమకొండ చౌరస్తా: నూతన ఆవిష్కరణలు, నిరంతర పరిశోధనలు, స్టార్టప్ కంపెనీలు స్థాపించేలా విద్యార్థులకు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో కే-హబ్ ఏర్పాటవుతున్నది. ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు రూ.15 కోట్లతో మూడు అంతస్థుల్లో భవనాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రూసా) కింద హబ్కు నిధులు మంజూరు చేశారు.
ఆంత్రోప్రెన్యూర్షిప్, ఇంక్యుబేషన్, కెరీర్ హబ్ల(కే-హబ్) నిర్మాణం పూర్తికావడంతో త్వరలో భవన ప్రారంభోత్సవానికి వర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆలోచనలు ఉన్న ప్రతి విద్యార్థి ఇక్కడికి వచ్చి ఆవిష్కరణతో వెళ్లేందుకు కే-హబ్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫార్మాస్యూటికల్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), బయోడైవర్సిటీ రక్షణ, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, జియోలాజికల్ సైన్స్, మైనింగ్, ఇతర రంగాల్లో పరిశోధనలు నిర్వహించనున్నారు.