హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి, మే 6(నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్, సోమవారం నుంచి న్యాయవిచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా జస్టిస్ ఘోష్ నేడు మేడిగడ్డను పరిశీలించనున్నారు. కలకత్తా నుంచి సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన, సాయంత్రం 5 గంటలకు ఇరిగేషన్శాఖ సెక్రటరీ రాహుల్బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.
9న బీఆర్కే భవన్లో ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులతో మరోసారి సమావేశం కానున్నారు. న్యాయవిచారణ కమిషన్ మెంబర్ సెక్రటరీగా హైకోర్టు విశ్రాంత రిజిస్ట్రార్ మురళీధర్ను నియమించాలని నిర్ణయించినట్టు తెలిసింది. విచారణలో టెక్నికల్ సాయం కోసం ప్రాజెక్టుతో సంబంధం లేని ఇద్దరిని సైతం తీసుకున్నట్లు సమాచారం. వారిలో నాగర్కర్నూల్ సీఈ విజయభాస్కర్, పీఅండ్ఎం ఎస్ఈ శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తున్నది. జస్టిస్ ఘోష్ మంగళవారం వరంగల్ చేరుకుని అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్తారు. మధ్యాహ్నం వరకు మేడిగడ్డ బరాజ్ను పరిశీలించి అధికారులతో సమావేశమవుతారు. భోజనం తర్వాత కాళేశ్వరం ఆలయంలో పూజలు చేసి రాత్రికి రామగుండం ఎన్టీపీసీ అతిథి గృహంలో బస చేస్తారు. మరుసటి రోజు సిద్దిపేటకు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.