హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరధే ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రమాణం చేశారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. అనంతరం గవర్నర్, సీఎం కేసీఆర్ వేర్వేరుగా పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. తొలుత సీఎస్ శాంతికుమారి ఆహ్వానం మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుజన ఈ నెల 19న రాష్ట్రపతి జారీచేసిన వారెంట్ను చదివి వినిపించారు. నూతన సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జారీచేసిన వారెంట్ ప్రతిని జస్టిస్ అరధేకు గవర్నర్ అందజేశారు.
అనంతరం నూతన సీజేగా జస్టిస్ అలోక్ అరధే దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు మహమూద్ అలీ, వీ శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంటరీపక్ష నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, రేవంత్రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్కుమార్, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు భేతి సుభాష్రెడ్డి, జీవన్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచారి, డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, జస్టిస్ అరధే కుటుంబసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయాధికారులు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
27కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ కన్నెగంటి లలితను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ సామ్కోశాయ్ తెలంగాణ హైకోర్టుకు బదిలీపై రానున్నారు. నూతన ప్రధాన న్యాయమూర్తి రాకతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 27కి చేరింది.
మధ్యప్రదేశ్లో లాయర్గా ప్రస్థానం
మధ్యప్రదేశ్కు చెందిన జస్టిస్ అలోక్ అరధే 1964 ఏప్రిల్ 14న రాయ్పూర్లో జన్మించారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తిచేశాక 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2007లో సీనియర్ న్యాయవాది అయ్యారు. రాజ్యాంగం, మధ్యవర్తిత్వం, కంపెనీ చట్టాల కేసులు వాదించటంలో విశేష అనుభవం గడించారు. 2009 డిసెంబర్ 29న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 సెప్టెంబర్ 1న జమ్ముకశ్మీర్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అకడి నుంచి 2018 నవంబర్ 17న కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. జమ్ముకశ్మీర్, కర్ణాటక రాష్ట్రాల హైకోర్టుల్లో తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. కర్ణాటక నుంచి పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు సీజేగా వచ్చారు. .