కరోనాతో ఓడిన ‘విజయ’ం!
పుట్టినరోజు నాడే జూనియర్ అసిస్టెంట్ మృతి
సదాశివనగర్, ఏప్రిల్ 23 : మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవిత పోరాటంలో గెలిచిన ఓ యువతి.. కొవిడ్ మహమ్మారితో పోరాటంలో ఓడింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడికి చెందిన జాజావ్ గంగాధర్రావు మూడో కుమార్తె జాజావ్ విజయ (26) తాడ్వాయి తాసిల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఆమె మూడు ఉద్యోగాలు సాధించి సత్తాచాటింది. మొదట అటవీశాఖ బీట్ ఆఫీసర్గా, పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగాలు రాగా.. పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరారు. మల్లుపేట్లో ఉద్యోగం చేస్తూనే గ్రూప్-4 పరీక్ష రాసి రెవెన్యూశాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఎంపికైంది. ఉద్యోగం రావడంతో మొక్కు చెల్లించుకునేందుకు వారం క్రితమే కుటుంబసభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లివచ్చారు. జ్వరం రావడంతో బుధవారం సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించగా విజయతోపాటు తల్లి, అక్కకు కరోనా పాజిటివ్ వచ్చింది. గురువారం విజయకు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు రావడంతో నిజామాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా.. చికిత్సపొందుతూ మృతిచెందింది.