హైదరాబాద్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ): బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం జీవితాంతం కృషిచేసిన జ్యోతిబా ఫూలే, సావిత్రిబా ఫూలేపై వనపట్ల సుబ్బయ్య రాసిన ‘బహుజన బావుటా’, దామెర రాములు రాసిన ‘నేను సావిత్రిబాయి ఫూలే మాట్లాడుతున్నాను’ పుస్తకాలను మూడు రాష్ట్రాల్లో 150 చోట్ల బుధవారం ఆవిషరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కవులు, కళాకారులు, ఉద్యోగులు, ప్రజాస్వామ్యవాదులు ఈ పుస్తకాలను చేతివృత్తుల వారి వద్దకు తీసుకువెళ్లి వారితో ఆవిష్కరింపజేసినట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు.
బుధవారం ఆయన హైరాబాద్ సాహిత్య అకాడమీ భవన్లో మాట్లాడుతూ.. ముంబైలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటి ముందు, పుణేలో జ్యోతిబా ఫూలే తిరుగాడిన చోట, సావిత్రిబా ఫూలే విశ్వవిద్యాలయంలోని ఆమె విగ్రహం వద్ద పుస్తకాలను ఆవిష్కరించినట్టు వివరించారు. నాందేడ్, సోలాపూర్, నాగపూర్తోపాటు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, గుంటూరు, తిరుపతిలోనూ పుస్తకావిషరణలు జరిగినట్టు వివరించారు. ఈ సాహిత్యాన్ని ఎవరికోసమైతే సృష్టిస్తున్నామో వారికి చేరినప్పుడే దాని ప్రయోజనం నెరవేరుతుందనే ఉద్దేశంతోనే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టినట్టు తెలిపారు.
నాట్లేసే లచ్చుమమ్మలు, చెట్టెకే గీతకార్మికులు, రోడ్లు ఊడ్చే పొరకల తల్లులు, కుండలు చేసే కుమ్మరులు, క్షవరం చేసే నాయీబ్రాహ్మణులు, చెప్పులు కుట్టే కష్టజీవులు, గౌడ, యా దవ, వడ్రంగి.. ఇలా అనేక చేతివృత్తుల వారు ఫూలే గురించి రాసిన పుస్తకాలను తమ చేతులతో ఆవిషరించడం గొప్ప అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. ట్యాంక్బండ్పై పొరకల తల్లులతో పుస్తకాలను ఆవిషరింపజేసినప్పుడు వాళ్లెంతో ఆనందించారని వివరించారు. ‘మన ఊరు-మన చెట్లు’ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలమంది విద్యార్థులు తమ ఊరిలోని చెట్ల గురించి కథలు రాశారని, 33 జిల్లాల ఈ బాలసాహిత్యాన్ని 33 పుస్తకాలుగా ఈ నెలాఖరులోగా ప్రచురించి విడుదల చేస్తామని గౌరీశంకర్ వివరించారు.