KTR | జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఎన్నిక పార్టీలు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నిక కాదని.. పదేండ్ల అభివృద్ధి, పాలనకి.. రెండు సంవత్సరాల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పదేళ్ల రైతుబంధు పాలనకు, రెండు సంవత్సరాల రాక్షస పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నికగా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని.. ఆమె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2500 ఇస్తుందని ఆశిస్తున్నారన్నారు. లక్షల మంది రైతన్నలు ఈమె గెలుస్తుందని ఆశిస్తున్నారని తెలిపారు.
ఆ తర్వాతే తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని.. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, తర్వాత మోసపోయిన యువతి యువకులు ఎదురు చూస్తున్నాన్నారు. తమ ఇళ్లు కూలగొట్టిన అరాచకాలను చూసిన తర్వాత, ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గెలవాలని, ఆ అరాచకాలు ఆగాలని హైదరాబాద్ నగర పేదలు కోరుకుంటున్నారన్నారు. మూతపడుతున్న బస్తీ దావఖానాలు, ఉచిత తాగునీరు ఆగిపోతున్న విషయాలు ప్రజలందరూ చూస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాదులో కట్టలేదని.. కేసీఆర్ కట్టిన హైదరాబాద్లో కట్టిన లక్ష ఇళ్లు, ఇచ్చిన ఇళ్ల పట్టాలు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజలకు గుర్తుకు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలకు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారని.. ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వకుండా దారుణంగా వారిని అవమానపరిచిన మైనార్టీలు, ఈ ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ఒక అవకాశంగా భావిస్తున్నట్లుగా చెప్పారు. తమకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్నీ మోసమని, ఈ అంశంలో గుణపాఠం చెప్పడానికి రాష్ట్రవ్యాప్తంగా బీసీలు సిద్ధంగా ఉన్నారని.. దళితబంధు, అభయహస్తం అని చెప్పి మోసం చేసిన దళితులు కూడా ఆగ్రహంతో ఉన్నారని.. తమ అభ్యర్థికి అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నదని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మరోసారి పాలన రావడానికి, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక పునాది కాబోతున్నదన్నారు.
మరోసారి రాష్ట్రంలో గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతున్నదని.. అన్ని వర్గాల మద్దతుతో, అండతో మా పార్టీ అభ్యర్థి సునీత ఘన విజయం సాధించబోతున్నారన్నారు. రెండు సంవత్సరాల ఈ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ మా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్లో ప్రతి ఒక్కరికి, నియోజకవర్గానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడు గోపీనాథ్ అన్నారు. హైదరాబాద్ నగరంలో అన్ని నియోజకవర్గాల్లో మా పార్టీ గెలుపొందిందంటే, అప్పటి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గోపీనాథ్ కృషి కూడా ఉందని.. గోపీనాథ్ అకాల మరణంతో బాధపడుతున్న కుటుంబాన్ని అందరూ ఆదుకోవాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించి, ఆయన సతీమణి సునీత గోపీనాథ్ గారికి టికెట్ కేటాయించడం జరిగిందన్నారు. సునీతకు సహాయం కోసం పార్టీ కీలక నాయకులంతా పనిచేయాలని కేసీఆర్ ఆదేశించారని.. అందరి ఆశీర్వాదాలతో సునీత ఎన్నికల్లో గెలువబోతున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.