హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘గ్రాండ్ హెల్త్ ఫిట్నెస్ చాలెంజ్’లో భాగంగా ఇప్పటివరకు 20 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య వివరాలను సేకరించినట్టు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. వీరిలో అత్యవసర వైద్యసేవలు అవసరమని గుర్తించిన 100 మందిని దవాఖానల్లో చేర్చినట్టు తెలిపారు. సంస్థ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, యూనిట్లలో ‘గ్రాండ్ హెల్త్ ఫిట్నెస్ చాలెంజ్’ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్ని రీజియన్లలో సిబ్బందికి 25 బృందాలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వివరించారు.
తార్నాకలోని ఆర్టీసీ దవాఖానను ఆధునికీకరించామని, ప్రస్తుతం 24 గంటల ఫార్మసీ, డయాగ్నస్టిక్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, గైనిక్ సేవల కోసం పూర్తిస్థాయి సిబ్బంది పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ దవాఖానకు వైద్యం కోసం వచ్చే ఉద్యోగులు, ఔట్ పేషెంట్ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నదని, తార్నాక దవాఖానలో లేని ఆరోగ్య సేవల కోసం పేషెంట్లను నిమ్స్ దవాఖానకు రిఫర్ చేస్తున్నామని పేర్కొన్నారు. వారికి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న నిమ్స్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో ప్రతి ఆర్టీసీ ఉద్యోగిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు.