ఎదులాపురం, జూలై 19: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో మొదటిసారిగా చేపట్టిన కీళ్ల మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. జిల్లా కేంద్రానికి చెందిన మహిళ కొంతకాలంగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నది. రిమ్స్లో చూపించగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. మంగళవారం ఆమెకు వైద్యుల బృందం గంటన్నరపాటు ఆపరేషన్ చేసింది. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. ఇక నుంచి ఆదిలాబాద్ రిమ్స్లోనే ఉచితంగా కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తామని తెలిపారు. ఇదే ఆపరేషన్ ప్రైవేట్లో చేయిస్తే రూ.2.50 లక్షలు ఖర్చవుతుందన్నారు.