వనపర్తి : ప్రజలకు ఏం కావాలో గ్రహించి అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతె ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy )అన్నారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, వనపర్తి పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టానని, దేశంలో వ్యవసాయిక జిల్లాగా వనపర్తిని అగ్రస్థానంలో ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. సోమవారం బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది యువకులు, మహిళలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ఏం కావాలి ఏం చేయాలో ముందు చూపుతో ప్రణాళికలను సిద్ధం చేసుకుని పనులు చేయడం వల్లనే అభివృద్ధి మీ ముందర కనిపిస్తుందని, మాటలు చెప్పడం రాదు.. పని చేయడం నా పని అని వివరించారు. చేయాలన్న సంకల్పం ఉంటే వనపర్తి అభివృద్ధి ఇంత వేగంగా అభివృద్ధి చేయవచ్చని చేసి చూపించానని మంత్రి గుర్తు చేశారు.
పాత కొత్త నాయకులు అందరు కలిసి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, కౌన్సిలర్లు బండారు కృష్ణ, కో అప్షన్ సభ్యులు ఇమ్రాన్, మండల యువజన సంఘం అధ్యక్షుడు చిట్యాల రాము, మునికుమార్, బాలరాజు, రామస్వామి, బొడ్డుపల్లి సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.