అలంపూర్ చౌరస్తా, ఆగస్టు 28 : తరచూ సెలువులు పెడుతుంటే రోగులకు వైద్య సేవ లు ఎలా అందిస్తారు.. ? అంటూ వైధ్యాదికారులు, సిబ్బందిపై జోగుళాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్బాషా మండిపడ్డారు. శుక్రవారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల దవాఖానను ఆయన తనిఖీ చేసి రోగులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిపడా సిబ్బంది ఉన్నప్పటికీ ఓపీ సంఖ్య ఆశించిన రీతిలో ఎందుకు లేదని అధికారులను ప్రశ్నించారు. ప్రతిరోజూ రోగుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ నిబంధనల ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.
అలంపూర్ చౌరస్తాలో వంద పడకల దవాఖానని ప్రజలకు అందుబాటులో ఉంచామని చెప్పారు. రోగులకు వైద్యం అందించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రసవాలకు వచ్చే మహిళలకు ఇబ్బందులు లేకుండా వారికి అన్ని రకాల వైద్యసేవలు అందించాలని సూచించారు. పారిశుధ్య సిబ్బంది ఉన్నప్పటికీ దవాఖాన ప్రాంగణంలో అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ధరణీషా తదితరులు ఉన్నారు.