అదొక పాత పెంకుటిల్లు. ఎందరో నిరుద్యోగుల భవిష్యత్తుకు బాటలు వేసిన పొదరిల్లు.. తన ఒడిలో చదువుకున్న వారి కలలను సాకారం చేసిన గూడు.. ఒకరిద్దరు కాదు ఏకంగా 55 మందికి కొలువులు అందించిన అండ. ఉద్యోగాలు సాధించాలనుకొనే యువతకు స్ఫూర్తినిస్తున్నది మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లికి చెందిన పులి రాజమల్లు గౌడ్ పాత ఇల్లు.
తాండూర్, మార్చి 20: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లికి చెందిన పులి రాజమల్లు కొత్త ఇల్లు కట్టుకోవడంతో పాత పెంకుటిల్లును 2012లో వదిలేశాడు. గ్రామానికి చెందిన పలువురు యువకులు అందులో చదువుకొంటామని అడిగితే ఒప్పుకొన్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వం పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయగా, ఇక్కడ చదువుకొన్న ఐదుగురు యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఆ తర్వాత దాన్ని పూర్తిగా నిరుద్యోగులు చదువుకొనేందుకు వదిలేశాడు రాజమల్లు. అప్పటి నుంచి బోయపల్లిలోని నిరుద్యోగులంతా ఇక్కడకు వచ్చి చదువుకొంటున్నారు.
ఇక్కడ చదువుకొంటే ఉద్యోగం వస్తుందని వీరిలో నమ్మకం ఏర్పడింది. ఈ చిన్న ఇంట్లో రెండే గదులు ఉన్నాయి. కొందరు లోపల కూర్చుండి చదువుకొంటే, మరొకొందరు చెట్ల కింద కూర్చొని పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ చదువుకున్న వారిలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గమనార్హం. ఉద్యోగాలు సాధించినవాళ్లు, పలువురు దాతలు నిరుద్యోగులకు కావాల్సిన 500 దాకా పుస్తకాలను అందుబాటులో ఉంచారు. స్టడీ సెంటర్లలో దొరికే మెటీరియల్ ఇక్కడ ఉండటం గమనార్హం.
సీనియర్ల సహకారం
ఇక్కడ చదివి ఉద్యోగం సంపాదించినవారు వారంలో ఏదో ఒక రోజు వచ్చి నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు. పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో అవగాహన కల్పిస్తారు. నమూనా ప్రశ్నపత్రాలు తయారు చేసి పరీక్షలు నిర్వహిస్తారు. పక్కా ప్రణాళిక ప్రకారం శిక్షణ ఇస్తారు. దీంతో ఇక్కడి వారు రాటుదేలుతున్నారు. ఇక్కడ చదువుకొని ఉద్యోగం వచ్చిన వారి స్ఫూర్తితో ఇంటి యాజమాని రాజమల్లు సైతం తపాలాశాఖలో కొలువు సాధించటం విశేషం.
రాష్ట్ర సర్కారు ఉద్యోగ ప్రకటనతో..
రాష్ట్ర ప్రభుత్వం 80 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించటంతో నిరుద్యోగులు ఈ పెంకుటింట్లో ఉన్న స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 18 మంది నిరుద్యోగులు చదువుకొంటున్నారు. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానికులు చెప్తున్నారు.
పిల్లల స్ఫూర్తితో ఉద్యోగం సాధించిన
మా ఇల్లు పాతబడితే కొత్తింటికి వెళ్లినం. అప్పుడు కొందరు విద్యార్థులు వచ్చి అందులో చదువుకొంటామని అడిగితే సరేనన్న. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు. ఫస్ట్ ఇక్కడ చదువుకొన్న ఐదుగురికి ఉద్యోగాలు వచ్చినయ్. వారి పట్టుదల చూసి నాకూ ఉత్సాహం కలిగింది. వారి స్ఫూర్తితో నేను కూడా చదివిన. అప్పటి బ్యాచ్లో తోట వెంకటేశం ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో నేర్పించాడు. 2013లో తపాలాశాఖలో ఉద్యోగాలు పడితే దరఖాస్తు చేసుకొన్నా. పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికైన. నా ఇల్లు నిరుద్యోగులకు వరంలా మారినందుకు సంతోషంగా ఉన్నది.
– పులి రాజమల్లుగౌడ్, బోయపల్లి, ఇంటి ఓనర్
డిఫెన్స్లో ఉద్యోగం కోసం
డిగ్రీ పూర్తి చేసిన. డిఫెన్స్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న. ఇక్కడ చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. సీనియర్ల సహకారం బాగుంది. అనేక మెళకువలు నేర్పుతున్నారు. పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ చదువుకొంటే ప్రశాంతంగా ఉంటున్నది.
– చొక్కాల శివ ప్రసాద్, బోయపల్లి
కోచింగ్ సెంటర్ వెళ్లే స్థోమత లేదు
డిగ్రీ పూర్తి చేసిన. ఆర్ఆర్బీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న. మా నాన్న రోజూ కూలీ చేసి కుటుంబాన్ని పోషిస్తాడు. వేలకువేలు పెట్టి కోచింగ్ సెంటర్కు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడే చదువుకొంటున్నా. ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు సాధించిన వారి సలహాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
– సుంకరి మనోజ్, తాండూర్