సారపాక, జూలై 14 : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలోనే పారిశ్రామిక రంగం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. పారిశ్రామిక కేంద్రమైన సారపాక ఐటీసీ పీఎస్పీడీలో( ITC factory) సుమారు రూ.2,800 కోట్లతో 8వ నూతన ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. పరోక్షంగా వేలాది కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందని అన్నారు.
ఐటీసీలో విస్తరణ జరిగినప్పుడే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండలం సారపాక ఐటీసీలో ఎనిమిదో ప్లాంట్ (మెషీన్) విస్తరణ కోసం స్థానిక బీపీఎల్ స్కూల్ ప్లే గ్రౌండ్లో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారి భూక్యా రవీందర్ అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన మాట్లాడారు. కర్మాగారం విస్తరణ వల్ల ఈ ప్రాంతానికి ఎంతో మేలు కలుగుతుందని అన్నారు.
1/70 చట్టం అమలులో ఉన్న ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించేందుకు కొత్త కంపెనీలేవీ ముందుకు రావడం లేదని, అందుకని ఇప్పటికే ఉన్న ఐటీసీని విస్తరించుకుంటే మన ప్రాంతంలోని ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతాయని అన్నారు. కంపెనీ కూడా లాభాపేక్షతో కాకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్యంపై దృష్టిసారించాలని, కాలుష్య రహిత పరిశ్రమగా ఉత్పత్తిని కొనసాగించుకోవాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా గోదావరి వరదలు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఐటీసీ యాజమాన్యం నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో సహాయ సహకారాలు అందించిందని గుర్తుచేశారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. సుమారు రూ.3 వేల కోట్లతో ప్లాంట్ విస్తరణ జరగడం ఈ ప్రాంత అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రైతులు ఐటీసీని నమ్ముకొని వేలాది ఎకరాల్లో జామాయిల్, సుబాబుల్ సాగుచేస్తున్నందున వారికి మద్దతు ధర కల్పించాలని కోరారు. పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న సంస్థకు ప్రభుత్వం కూడా అండగా నిలుస్తుందని చెప్పారు.