హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 25: ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలోనే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని, ఇప్పటివరకు 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం హనుమకొండ డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో ఏర్పాటుచేసిన మెగాజాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్య, ఉపాధి, ఉద్యోగావకాశాలు విపరీతంగా పెరిగాయన్నారు. సీఎం కేసీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ల కృషితో తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగినట్టు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించి ఇప్పటికే 90 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి వివరించారు.
కేటీఆర్ కృషితో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని చెప్పారు. ఐటీలో బెంగళూరుకు దీటుగా హైదరాబాద్ ఎదిగిందని, అలాగే అన్ని జిల్లాకేంద్రాల్లో ఐటీ రంగం, వివిధ కంపెనీలను తీసుకొచ్చేందుకు మంత్రి కేటీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు. వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లో ఇప్పటికే ఐటీ కంపెనీలు వచ్చాయని, ఇంకా వస్తున్నాయన్నారు. కాగా ఈ జాబ్మేళాలో మొత్తం 34 కంపెనీలు పాల్గొనగా ఎంపికైనవారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.