హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీలో వచ్చే నెలలో కూడా ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నారు. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ఫిబ్రవరి 1 వరకు పొడగించింది. దాంతో ప్రభుత్వం దీనిపై సమీక్ష జరిపి కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి ఫిజికల్ తరగతులు నిర్వహించేలా చూడా అధికారులను ఆదేశించింది.
దాంతో, జేఎన్టీయూ హైదరాబాద్ అధికారులు సమావేశమై ప్రభుత్వ నిర్ణయంపై సమీక్ష జరిపారు. ప్రస్తుతం మొదటి, రెండవ సంవత్సరం గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతులను ఫిబ్రవరి 14 వరకు కొనసాగించాని నిర్ణయించినట్లు సమాచారం. ఫిబ్రవరి 14 నుంచి ఫిజికల్ తరగతులను కొవిడ్ నిబంధనలకు కట్టుబడి నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, మూడవ, నాలుగో సంవత్సరం విద్యార్థులతోపాటు అన్ని పీజీ కోర్సులకు ఫిబ్రవరి 1 నుంచి ఆఫ్లైన్లోనే తరగతులు, పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీని ప్రకారం వివిధ కోర్సుల విద్యార్థులకు తరగతుల నిర్వహణపై యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీలకు నోటీసులు పంపారు.
శనివారం నాటి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి, తెలంగాణలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గిన నేపథ్యంలో విద్యాసంస్థలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.