హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ హైదరాబాద్ కొత్తగా మూడు రకాల డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. బ్లాక్ చైన్, డాటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అంశాల్లో 6 నెలల సర్టిఫికెట్ కోర్సులను ఆన్లైన్ ద్వారా అందించనున్నది. ఆసక్తి గల బీటెక్, ఎంటెక్ విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ల ఫీజు రూ.500 చెల్లించి జూలై 23 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో జూలై 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
కోర్సు ఫీజు చెల్లించే ప్రక్రియను ఆగస్టు 6 నుంచి ప్రారంభిస్తారు. ఆగస్టు 15 నుంచి 6 నెలల పాటు బోధన ఉంటుంది. ఆన్లైన్ ద్వారా సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు 2 గంటల పాటు క్లాస్ ఉంటుందని జేఎన్టీయూ అధికారులు తెలిపారు. కోర్సు ఫీజు రూ.25 వేలు చెల్లించాలని, పూర్తి వివరాలకు జేఎన్టీయూహెచ్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.