మహేశ్వరం, జూన్ 21: రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 33/11 కేవీ విద్యుత్తు సబ్స్టేషన్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ 48 గంటల్లోనే కార్యరూపం దాల్చింది. సోమవారం హరితోత్సవంలో ఆయన ఈ హామీ ఇవ్వడంతో సబ్స్టేషన్ ఏర్పాటుకు 24 గంటలు తిరక్కుండానే జీవో జారీ అయింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి కలిసి బుధవారం తుమ్మలూరు మాక్ ప్రాజెక్టు వద్ద ఈ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. రూ.7.5 కోట్ల వ్యయంతో కేవలం 2 నెలల్లోనే ఈ సబ్స్టేషన్ నిర్మాణ పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు శిలాఫలకాల వద్ద మొక్కలు నాటి నిరసన తెలపాల్సి వచ్చేదని, నేడు విద్యుత్తు సబ్స్టేషన్ ఏర్పాటుకు కేవలం 24 గంటల్లోనే జీవో తెచ్చి, 48 గంటల్లోనే శంకుస్థాపన చేయడం సీఎం కేసీఆర్ అద్భుత పాలనకు నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.