సిద్దిపేట : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) ను మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ( Jeevan Reddy) శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి కేసీఆర్ను పలకరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ అన్నా.. నన్ను దేవుడే పంపిండు. మీతో కలిసి పని చేయమని’ అంటూ కేసీఆర్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి , కుమారులు, జగిత్యాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు కేసీఆర్ను కలిసినవారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి తొలిసారి వచ్చిన జీవన్ రెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డా. కె.సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

‘ తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీదగ్గరికి పంపించిండు. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్ల కైనా మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది’ అంటూ మనసులోని మాటను వ్యక్తం చేశారు. ఈ సంద్భంగా జీవన్రెడ్డిని కేసీఆర్ సన్మానించారు.

