JEE Mains | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్స్లో సేమ్ మార్కులు(ఒకే మార్కులు) సాధించిన విద్యార్థులకు సబ్జెక్టులవారీగా ర్యాంకులు కేటాయించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మార్పులు చేసింది. తొలుత గణితంలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఫిజిక్స్, ఆ తర్వాత కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో విద్యార్థులకొచ్చిన మార్కులను లెక్కలోకి తీసుకుంటారు. ఆ తర్వాత తక్కువగా తప్పు సమాధానాలు, ఎక్కువగా సరైన సమాధానాలు రాసినవారీగా ర్యాంకులు కేటాయిస్తారు. ఆ తర్వాత గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో తక్కువ తప్పు సమాధానాలిచ్చి, ఎక్కువగా సరైన సమాధానాలు రాసినవారిని పరిగణనలోకి తీసుకుంటారు. ఇది వరకు అభ్యర్థుల వయస్సును పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను కేటాయించేది. మొత్తం 300 మార్కులకు ఏడాదికి రెండు సార్లు జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తుండగా, దేశవ్యాప్తంగా 8లక్షలకుపైగా విద్యార్థులు హాజరవుతున్నారు.
జాతీయంగా ఒకే పరీక్ష కావడంతో పలువురు విద్యార్థులు ఒకే మార్కులను సాధిస్తున్నారు. ఇలాంటి వారు వేలల్లో ఉంటున్నారు. వీరికి ర్యాంకులను కేటాయించడంలో ఇది వరకు ఎన్టీఏ మొదట వయస్సును లెక్కలోకి తీసుకుని, సీనియర్కు ఎక్కువ ర్యాంకు.. జూనియర్కు తక్కువ ర్యాంకును కేటాయించేది. కానిప్పుడు ఈ విధానాన్ని ఎన్టీఏ తొలగించింది. సబ్జెక్టులవారీగా ర్యాంకులు కేటాయించాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా జేఈఈ మెయిన్స్ వెబ్సైట్ పేరును సైతం ఎన్టీఏ మార్చింది. తాజాగా jeemain.nta.ac.in పేరుతో కొత్త వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొచ్చింది.